హైదరాబాద్: అసత్య ప్రమాణం కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోమవారం బేషరతుగా సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. బీసీసీఐ ప్రక్షాళన కోసం జస్టిస్ లోధా కమిటీ సమర్పించిన సిఫారసుల అమలు విషయంలో అనురాగ్ ఠాకూర్ సుప్రీం కోర్టుకు అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పిన సంగతి తెలిసిందే.
జస్టిస్ లోధా కమిటీ సంస్కరణ అమలులో అలసత్వం వహించిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, సెక్రటరీ అజయ్ షిర్కేలపై జనవరి 2వ తేదీన వేటు వేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన విచారణలో వ్యక్తిగత హాజరు విషయంలో కోర్టు ఠాకూర్కు మినహాయింపునిచ్చింది.
బీసీసీఐ ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసుల అమలును అడ్డుకుంటున్నారనే ఆరోపణలపై అనురాగ్ ఠాకూర్పై సుప్రీంకోర్టు కోర్టుధిక్కరణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఠాకూర్తో పాటు షిర్కేను సుప్రీం కోర్టు పదవినుంచి తొలగించింది.

దాంతో పాటు అబద్ధపు సాక్ష్యం, కోర్టు ధిక్కార కేసులు ఎందుకు మోపకూడదో తెలుపాలంటూ షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలోనే అనురాగ్ ఠాకూర్ సోమవారం బేషరతుగా సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత బీసీసీఐ కార్యకలాపాలు నిర్వహించేందుకు కాగ్ మాజీ చీఫ్ వినోద్రాయ్ అధ్యక్షతన నలుగురితో కూడిన కమిటీని నియమించిన సంగతి తెలిసిందే
ఈ కమిటీలో సభ్యులుగా కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడీఎఫ్సీ అధికారి విక్రమ్ లిమాయె, మహిళ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలు ఉన్నారు. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం కొత్త ఆఫీసు బేరర్ల ఎన్నికలు జరిగేంత వరకు బీసీసీఐ కార్యకలాపాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.