ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ కప్లో ఆడాలంటే.. దాని కన్నా ముందు జరిగే ఆసియా కప్లో రాణించడం చాలా ముఖ్యం. అయితే ఇప్పటికే గాయాలతో ఉన్న కొందరు ప్లేయర్లు ఈ ఆసియా కప్ ఆడటం అనుమానంగా మారింది. ఈ టోర్నీ నాటికి జస్ప్రీత్ బుమ్రా రికవర్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. అయితే వెటరన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టోర్నీ ఆడలేడని సమాచారం.
ఇప్పుడు ఈ జాబితాలో యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ కూడా చేరాడు. వెన్నునొప్పితో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో జట్టుకు దూరమైన అతను.. ఆ తర్వాత న్యూజిల్యాండ్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ ఆపరేషన్ తర్వాత అతను నెమ్మదిగా కోలుకుంటున్నాడు. టీమిండియా మిడిలార్డర్లో కీలకంగా మారిన అతను.. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆశించారు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా అతను లేని లోటు కనిపించింది. దీంతో అయ్యర్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ ప్రస్తుతం అయ్యర్ అంత వేగంగా కోలుకోవడం లేదని సమాచారం. ఇదే కొనసాగితే అతను ఆసియా కప్ నాటికి పూర్తి ఫిట్నెస్ సాధించలేడని తెలుస్తోంది. ఇప్పటికి కూడా అయ్యర్ వెన్నునొప్పి తగ్గలేదని సమాచారం. తాజాగా ఎన్సీయేలో అతని వెన్నుకు ఇంజెక్షన్ ఇచ్చారట.
అంటే, అయ్యర్ వెన్ను సమస్య ఇంకా పూర్తిగా తీరలేదన్నమాట. కాబట్టి ఆసియా కప్లో అతను ఆడలేడు. అయ్యర్ కనుక ఆసియా కప్ ఆడకపోతే వన్డే వరల్డ్ కప్కు కూడా అతని ఎంపిక అనుమానమే. ఎందుకంటే గాయం నుంచి కోలుకున్న ప్లేయర్ను నేరుగా వన్డే వరల్డ్ కప్ ఆడించడం బుద్ధి తక్కువ పని అవుతుంది. దాని కన్నా ఇప్పటి నుంచే వేరే ప్లేయర్ను మిడిలార్డర్లో ఆడిస్తూ వెళ్తే.. వరల్డ్ కప్ నాటికి అతను తన స్థానంలో కుదురుకునే ఛాన్స్ ఉంది.
అయ్యర్ స్థానాన్ని ప్రస్తుతానికి సూర్యకుమార్ యాదవ్తో భర్తీ చేయాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. కానీ వన్డేల్లో సూర్యకుమార్ రికార్డు అంత గొప్పగా లేదు. ఆసీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో సూర్య.. వరుసగా గోల్డెన్ డక్లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ స్థానంలో కొత్త వారిని చూస్తామేమో చూడాలి.