Mohammad Kaif: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచానికి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో వార్తల్లో నిలిచాడు. దీనికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ వయస్సు. వైభవ్ తరహాలోనే ఉత్తరప్రదేశ్కు చెందిన మహ్మద్ కైఫ్ కూడా తన బ్యాటింగ్ ప్రతిభతో అద్భుతం సృష్టించాడు. 14 ఏళ్ల ఈ యువ క్రికెటర్ డెహ్రాడూన్లో జరిగిన అండర్-14 రాజ్ సింగ్ దుంగార్పూర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. మహ్మద్ కైఫ్ 280 బంతులను ఎదుర్కొని 250 పరుగులతో అజేయంగా నిలిచాడు. మహ్మద్ కైఫ్ తన ఇన్నింగ్స్లో 19 ఫోర్లు, 12 అద్భుతమైన సిక్సర్లు కొట్టాడు.
ఫైనల్లో మెరిసిన కైఫ్
ఇటీవల కాన్పూర్లో జరిగిన ట్రయల్స్ ఆధారంగా కైఫ్ అండర్-14 యూపీ జట్టులోకి ఎంపికయ్యాడు. డెహ్రాడూన్లో జరిగిన అండర్-14 రాజ్ సింగ్ దుంగార్పూర్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో యూపీ విదర్భతో తలపడింది. ఈ మ్యాచ్ మే 3 నుంచి మే 5 వరకు జరిగింది. ఉత్తరప్రదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఉత్తరప్రదేశ్ తరఫున మహ్మద్ కైఫ్ 280 బంతుల్లో 250 పరుగులు చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో 377 నిమిషాలు గడిపి 89.29 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. దీంతో ఉత్తరప్రదేశ్ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

తండ్రి కూలీ.. కొడుకు క్రికెటర్
రోజువారీ కూలిగా పనిచేసే మున్నాకు భార్య, ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. 14 ఏళ్ల మహ్మద్ కైఫ్ తోబుట్టువులలో చిన్నవాడు. చిన్నప్పటి నుంచి కైఫ్ క్రికెటర్ కావాలనేది కల అని తండ్రి మున్నా చెప్పారు. కైఫ్ ఏడేళ్ల వయసులోనే బ్యాట్ పట్టుకున్నాడు. తాను ఆడుతున్నప్పుడు గమనించి ప్రోత్సహించినట్లు తండ్రి చెప్పుకొచ్చాడు. మహ్మద్ కైఫ్ కోచ్లు బద్రుద్దీన్ సిద్ధిఖీ, మహ్మద్ హసీన్ మాట్లాడుతూ.. సమయానికి ప్రాక్టీస్ చేయడం ఎల్లప్పుడూ మహ్మద్ కైఫ్ ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు. వైభవ్ సూర్యవంశీ లాగే మహ్మద్ కైఫ్ కూడా త్వరలో భారత క్రికెట్లో ప్రకాశిస్తాడని.. దేశ భవిష్యత్తుగా పిలువబడతాడని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.