టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభంకాక ముందే ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత కారణాలతో భారత్ సిరీస్ నుంచి స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా యువ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. వీసా సమస్య కారణంగా భారత్లో అడుగుపెట్టలేకపోయిన బషీర్ తిరిగి ఇంగ్లాండ్కు చేరుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. ఇలాంటి విషయాలతో తనకు చిరాకు వస్తుందని అన్నాడు. అరంగేట్ర ప్లేయర్కు ఇలా జరగడం నిరాశ కలిగించిందని పేర్కొన్నాడు. ''డిసెంబర్ మధ్యలో భారత్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. కానీ బషీర్ ఇండియా రావడానికి ఇప్పటికీ వీసా లేదు. అతడి విషయంలో ఫ్రస్టేషన్ వచ్చింది. ఇంగ్లాండ్ టెస్టు జట్టులో తొలి సారి అవకాశం దక్కించుకున్న అతడికి ఇలాంటి అనుభవం ఎదురుకాకూడదు''.

''షోయబ్ బషీర్ గురించి బాధ పడుతున్నా. అయితే ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న మొదటి వ్యక్తి బషీర్ మాత్రమే కాదు. గతంలో చాలా మందిఎదుర్కొన్నారు. ఒక ఆటగాడిని ఎంపిక చేసిన తర్వాత, అతడు వీసా కారణంగా జట్టులో లేకపోతే కెప్టెన్గా చిరాకు వస్తుంది. అతడి వీసా సమస్య పరిష్కారం కోసం కొందరు తీవ్రంగా ప్రయ్నతించినప్పటికీ నిరాశే మిగిలింది'' అని బెన్ స్టోక్స్ అన్నాడు.
బషీర్ పాకిస్థాన్ సంతతికి చెందిన వాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు మొత్తం అబుదాబి నుంచి ఆదివారమే భారత్కు చేరుకుంది. బషీర్ మాదిరిగానే రెహన్ అహ్మద్ కూడా పాక్ సంతతి. కానీ వన్డే ప్రపంచకప్లో స్టాండ్ బై ప్లేయర్గా రెహన్ మహ్మద్ ఎంపికవ్వడంతో అతడి వద్ద అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అన్నీ ఉన్నాయి. గతేడాది ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా వీసా కారణాలతో జట్టుతో కాకుండా ఆలస్యంగా ఇండియాకు వచ్చాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్లో పాకిస్థాన్ ఆటగాళ్లకు ఒక్క రోజు ముందే వీసా ముంజూరైంది. కాగా, రేపటి నుంచి ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, షోయబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్, డాన్ లారెన్స్