
హైదరాబాద్: భారత్-శ్రీలంక-బంగ్లాదేశ్ల మధ్య మార్చి 6నుంచి ముక్కోణపు సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత జట్టు నుంచి కోహ్లీని విరామం కోసం దూరంగా ఉంచింది భారత జట్టు. ఇలా కెప్టెన్ దూరమైనా.. రోహిత్ను వైస్ కెప్టెన్ నుంచి కెప్టెన్ చేసి సిరీస్కు సిద్ధమైంది.
వైస్ కెప్టెన్ బాధ్యతలు ధావన్ నిర్వర్తింనుండటంతో.. జట్టులో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు భారత జట్టులాగే బంగ్లాదేశ్ భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తాజాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హాసన్ కూడా ముక్కోణపు టోర్నీకి దూరం అయ్యాడు.
దీంతో జట్టు బాధ్యతలను మరో ఆటగాడికి అప్పగించనుంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ). గాయానికి చికిత్స కోసం థాయ్లాండ్ వెళ్లిన షకీబ్ శుక్రవారం తిరిగి స్వదేశానికి చేరుకోనున్నాడు. మరో వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో అతడు ముక్కోణపు సిరీస్కు దూరమవుతున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) వర్గాలు తెలిపాయి.
భవిష్యత్తులో కీలక టోర్నీలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కోహ్లీ, ధోనీ, పాండ్య, భువనేశ్వర్ తదితర ఆటగాళ్లకు విశ్రాంతినివ్వగా, గాయాల కారణంగా శ్రీలంక, బంగ్లాదేశ్ ఆటగాళ్లు దూరం కానున్నారు.
రేపు సన్నాహక శిబిరం ముగించుకుని 4న బంగ్లా జట్టు లంకకు బయల్దేరనుంది. టోర్నీలో బంగ్లా జట్టు తన తొలి మ్యాచ్లో భారత్ను ఢీకొననుంది. టోర్నీలోని మొదటి మ్యాచ్ భారత్-శ్రీలంకల మధ్య మార్చి 6న జరగనుంది. టోర్నీలో పాల్గొనే మూడు జట్ల నుంచి కీలక ఆటగాళ్లు దూరం కావడంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.