బ్రిస్బేన్: మరోసారి రోహిత్ శర్మ సెంచరీ వృధా అయింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది. అయిదు వన్డేల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యాన్ని సాధించింది. రెండో వన్డేలో ఆసీస్ ఏడు వికెట్లతో భారత్పై సునాయసంగా విజయం సాధించింది.
309 లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో ఓవరు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఆసీస్ మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన బెయిలీ 56 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్తో 76 పరుగులు చేసి ఆసీస్కు అద్భుత విజయాన్ని అందించాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు రోహిత్ భారీ స్కోర్ను అందించాడు. వరుసగా రెండో వన్డేలోనూ రోహిత్ సెంచరీ చేశాడు. 127 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో రోహిత్ 124 పరుగులు చేశాడు. తొలి వన్డేలో అజేయంగా 171 రన్స్ చేసిన రోహిత్ రెండో వన్డేలోనూ దూకుడుగా ఆడాడు. కోహ్లీ, రహానేలు కూడా హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

సెంచరీ హీరో రోహిత్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఛేజింగ్కు దిగిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఆరోన్ ఫించ్, షాన్ మార్ష్లు శరవేంగా పరుగులు రాబట్టారు. ప్రతి బౌలర్ను అలవోకగా ఎదుర్కొన్నారు.
ఈ ఇద్దరూ తొలి వికెట్కు 145 రన్స్ జోడించారు. తొలి వన్డేలోనూ పేలవ బోలింగ్తో మ్యాచ్ను చేజార్చుకున్న భారత్ రెండో వన్డేలోనూ అదే తీరును ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించినా ధోనీ సేన ఓటమిని మాత్రం అడ్డుకోలేపోయింది.