హైదరాబాద్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న చారిత్రాత్మక 100వ టెస్టులో బంగ్లాదేశ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తోంది. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో 100 డిస్మిసల్స్ చేసిన తొలి బంగ్లాదేశ్ వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు.
ఇందులో 88 క్యాచ్లు కాగా, మరో 12 స్టంప్ అవుట్లు ఉన్నాయి. ప్రస్తుతం కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ముష్ఫికర్ ఈ ఘనత సాధించాడు. ముష్ఫికర్ తర్వాత అత్యధిక డిస్మిసల్స్ చేసిన బంగ్లా క్రికెటర్గా ఖలీద్ మసూద్ (87) రెండో స్థానంలో నిలిచాడు.
28 ఏళ్ల ముష్ఫికర్ రహీం బంగ్లాదేశ్ తరుపున ఇప్పటివరకు 54 టెస్టులు మ్యాచ్లు ఆడాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. 2005లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు 5 సెంచరీలు, 17 అర్ధసెంచరీలతో మొత్తం 3243 పరుగులు చేశాడు.
కొలంబో టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 338 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 467 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 129 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. బంగ్లా ఆటగాడు షకీబ్ ఉల్ హాసన్ (159 బంతుల్లో 116; 10 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు.