PAK vs BAN: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా క్రికెట్ కూడా నష్టపోయింది. ఐపీఎల్ 2025 ఒక వారం పాటు వాయిదా పడింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025 కూడా ప్రస్తుతానికి రద్దు చేయబడింది. ఇప్పుడు పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగబోయే ఓ కీలక సిరీస్ కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్ పర్యటన గురించి ఆలోచిస్తోంది. ఈ పర్యటన రెండు వారాల్లో ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ జట్టు మే 25 నుంచి జూన్ 3 మధ్య పాకిస్థాన్లో 5 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఈ మ్యాచ్లు ఫైసలాబాద్లోని ఇక్బాల్ స్టేడియం, లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరగనున్నాయి. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత కారణంగా పర్యటన సురక్షితమో కాదో బంగ్లాదేశ్ నిర్ణయించుకోలేకపోతోంది.

ప్రకటన విడుదల చేసి బీసీబీ
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025లోని మిగిలిన 8 మ్యాచ్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వాయిదా వేసింది. గతంలో దీనిని యూఏఈలో పూర్తి చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కానీ అక్కడ కూడా తిరస్కరించబడింది. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడుతున్న బంగ్లాదేశ్ కు చెందిన నహిద్ రాణా, రిషాద్ హుస్సేన్ దుబాయ్ వెళ్లారు. టీ20 సిరీస్ గురించి ప్రస్తావిస్తూ ఆటగాళ్ల భద్రత అత్యంత ముఖ్యమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్లు ఆడడానికి, సిద్ధం కావడానికి బంగ్లాదేశ్ జట్టు యూఏఈలో రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటన పేర్కొంది. ఈ సిరీస్ వచ్చే వారం ప్రారంభమవుతుంది.
పాకిస్థాన్ పర్యటనకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో నిరంతరం సంప్రదిస్తోంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భద్రత అత్యంత ముఖ్యమైనదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేర్కొంటోంది. పాకిస్థాన్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్తో సన్నిహితంగా బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ను పాకిస్థాన్ కు దగ్గరగా ఉన్న దేశంగా పరిగణిస్తారు. పహల్గామ్ దాడి తర్వాత బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏఎల్ఎం ఫజ్లూర్ రెహమాన్ సోషల్ మీడియాలో భారత్ పాకిస్థాన్పై దాడి చేస్తే.. బంగ్లాదేశ్ 7 ఈశాన్య భారత రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటుందని రాసుకొచ్చారు. ఇంత సన్నిహితంగా ఉన్న బంగ్లాదేశ్ కూడా తన క్రికెట్ జట్టు పాకిస్థాన్కు పంపేందుకు భయాందోళనకు గురవుతోంది.