
కొన్నిరోజుల క్రితం మహిళల టీ20 వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రనౌట్ అయింది. ఆమె అలా అవుటవడమే ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చింది. లేదంటే సెమీఫైనల్లో భారత్ గెలవాల్సింది. కానీ రెండో పరుగు పూర్తి చేయడంలో ఆమె కొంత నిర్లక్ష్యం చూపించడంతో మ్యాచ్ చేజారింది. రన్ చేసే సమయంలో హర్మన్ప్రీత్ బ్యాటు నేలలో దిగబడటంతో ఆమె అవుటైందని, ఇది దురదృష్టం కాబట్టి ఏం చెయ్యలేమని అభిమానులు సర్దిచెప్పుకున్నారు.
కానీ కొంతమంది మాజీలు దీన్ని ఒప్పుకోలేదు. ఆ పరుగు చూస్తుంటేనే హర్మన్ చాలా తీరికగా, నిదానంగా పరుగు పూర్తిచేయబోయిందని ఎత్తిచూపారు. ఇలా తీరుబడిగా పరుగు తీస్తుంటే ప్రత్యర్థులు వికెట్లు గిరాటేయకుండా ఎందుకు ఉంటారు? అని నిలదీశారు. ఇదే క్రమంలో హర్మన్ను అవుట్ చేసిన ఆసీస్ కీపర్ అలీసా హేలీ కూడా హర్మన్ ప్రయత్నించి ఉంటే పరుగు పూర్తి చేసి ఉండేదని, ఆమె చాలా తీరుబడిగా రావడం వల్లనే అవుటైందని స్పష్టం చేసింది.
ఇప్పుడు మరో ప్లేయర్ కూడా అలాగే తన బద్దకంతో పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మైకేల్ బ్రేస్వెల్ పరుగు తీసే క్రమంలో బ్యాటును క్రీజులో పెట్టలేదు. దాన్ని అలాగే గాలిలో ఉంచి క్రీజు దాటబోయాడు.
ఈ సమయంలో బంతి అందుకున్న ఇంగ్లండ్ కీపర్ చటుక్కున వికెట్లు గిరాటేసి, అంపైర్కు అప్పీల్ చేశాడు. రిప్లేలో చూస్తే కరెక్ట్గా వికెట్లు కూలిన సమయంలో.. బ్రేస్వెల్ బ్యాటు కానీ, కాలు కానీ క్రీజు అవతల నేలను తాకలేదు. దీంతో అతన్ని అంపైర్ అవుటిచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ మరీ ఇంత బద్దకంగా రనౌట్ అవడం ఏంటని మండిపడుతున్నారు.