మరో వారం రోజుల్లో క్రికెట్ పండగ మొదలుకానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ సందడి మొదలుకానుంది. ప్రతిసీజన్ తరహాలోనే అన్ని జట్లు ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నాయి. అయితే అభిమానుల్లో ముంబై ఇండియన్స్ జట్టుపై ఎక్కువ ఆసక్తి పెరిగింది. ముంబై ఛాంపియన్గా నిలుస్తుందా లేదా అనే విషయం కంటే జట్టులో అంతర్గత విభేదాలు ఎలా ఉంటాయనే సందేహాలు మొదలయ్యాయి.
దానికి కారణం ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు చేయడమే. ట్రేడింగ్లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ముంబై గూటికి తిరిగొచ్చాడు. అంతేగాక రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ సారథి బాధ్యతలు అందుకున్నాడు. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ను కాదని హార్దిక్ కెప్టెన్ పగ్గాలు ఎలా అందిస్తారని విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ముంబై జట్టులోని ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు రోహిత్కు మద్దతుగా నేరుగా, పరోక్షంగా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై జట్టు రెండు వర్గాలు విడిపోయాయనే కథనాలు కూడా వచ్చాయి. అలాగే సోషల్ మీడియాలో రోహిత్ వర్సెస్ హార్దిక్ అంటూ ఫ్యాన్ వార్స్ కూడా మొదలయ్యాయి.
అయితే ప్రాక్టీస్లో హార్దిక్ పాండ్య ఇబ్బండి పడిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ప్రాక్టీస్లో హార్దిక్ ఎడమకాలికి గాయమైనట్లు వీడియోలో తెలుస్తోంది. బెంచ్పై పడుకున్న హార్దిక్కు ఫిజియో చికిత్స అందిస్తున్నాడు. ఫిజియోతో పాటు ముంబై బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ కూడా అక్కడే ఉన్నాడు. హార్దిక్ గాయం తీవ్రత తక్కువే అని తెలుస్తోంది.
మరోవైపు ఈ వీడియోను షేర్ చేస్తూ రోహిత్ ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయడం, గాయపడటం, మ్యాచ్లకు దూరమవ్వడమే హార్దిక్ లైఫ్ స్టైల్ అని, ఈ గాయంతో ఐపీఎల్ 2024 సీజన్కు కూడా హార్దిక్ దూరమవుతాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా, మార్చి 24న ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. మార్చి 27న ఉప్పల్లో సన్రైజర్స్ హైదరాబాద్తో ముంబై పోటీపడనుంది.