టీమిండియా అభిమానులను ఆస్ట్రేలియా మరోసారి బాధ పెట్టింది. ఫైనల్స్లో భారత్ను ఓడించి వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్లను ఇటీవల ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీమిండియాను మరోసారి అధిగమించి ఆస్ట్రేలియా మరో ఘనత సాధించింది. టెస్టుల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న రోహిత్ సేనను దాటి అగ్రస్థానానికి చేరింది.
గతంలో ర్యాంకింగ్స్లో ఇరు జట్లకు 118 పాయింట్లతో ఉండేవి. కానీ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ సమం కావడంతో భారత్ 117 పాయింట్లకు పడిపోయింది. అదే సమయంలో పాకిస్థాన్ టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుని టీమిండియాను దాటి అగ్రస్థానానికి ఎగబాకింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే.

సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కానీ ఆ తర్వాత బలంగా పుంజుకుని కేప్ టౌన్లో జరిగిన రెండో టెస్టులో మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు స్వదేశంలో పాకిస్థాన్తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ను మరో టెస్టు మిగిలుండగానే 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. తొలి టెస్టులో 360 పరుగుల తేడాతో, రెండో టెస్టులో 79 పరుగుల తేడాతో ఆసీస్ గెలిచింది. ప్రస్తుతం సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ విజయం దిశగా అడుగులు వేస్తుంది.
ప్రస్తుతం భారత్ వన్డే, టీ20ల్లోనే అగ్రస్థానంలో ఉంది. టెస్టుల్లో రెండో స్థానానికి పడిపోయింది. కాగా, జనవరి 25 నుంచి టీమిండియా స్వదేశంలో ఇంగ్లాండ్తో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో సత్తాచాటితే తిరిగి అగ్రస్థానానికి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కంటే ముందు అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. జనవరి 11న మొహాలి వేదికగా తొలి మ్యాచ్, జనవరి 14న ఇండోర్లో రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరు వేదికగా ఆఖరి మ్యాచ్ జరగనుంది.