హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీమానా చేయడంతో బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. కోచ్గా తన పద్ధతులపై కెప్టెన్కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో కుంబ్లే రాజీనామా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
కోహ్లీ వల్లే కుంబ్లే రాజీనామా చేశాడని తెలియడంతో సోషల్ మీడియాలో కోహ్లీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, మదన్ లాల్ లాంటి వారు సైతం కుంబ్లేకి మద్దతుగా నిలిచారు. కుంబ్లేని బీసీసీఐ అవమానకరంగా సాగనంపిందని మండిపడ్డారు.

కోహ్లీకి తనలాగే అవినీతికి పాల్పడే వ్యక్తినే కోచ్గా ఉండేందుకు ఇష్టపడతాడని కోహ్లీపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. తాజాగా కుంబ్లే రాజీనామా వివాదంలో కోహ్లీపై బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్ కే) విరుచుకుపడ్డాడు. నిజాయతీగా పనిచేసే వ్యక్తులు కోహ్లీకి నచ్చరంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టాడు.
'కుంబ్లే నిజాయతీపరుడు. విరాట్ కోహ్లీ మాత్రం రవిశాస్త్రి లాంటి వ్యక్తినే కోచ్గా ఇష్టపడతాడు. రవిశాస్త్రి కూడా కోహ్లీ లాగే అవినీతి పరుడు కావడమే ఇందుకు కారణం' అని కమల్ రషీద్ ఖాన్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ స్టేజిలో శ్రీలంక చేతిలో కోహ్లీసేన ఓటమి పాలైన తర్వాత భారత్ కచ్చితంగా కప్పు నెగ్గదని కేఆర్ కే జోస్యం చెప్పగా అదే నిజమైన సంగతి తెలిసిందే. కోహ్లీ చెత్త ప్రదర్శన వల్లే టీమిండియా ఓటమిని మూట గట్టుకుందని తీవ్ర విమర్శలు చేశాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉంది. లండన్లో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత కోహ్లీసేన అటు నుంచి అటే వెస్టిండిస్ పర్యనటకు బయల్దేరిన సంగతి తెలిసిందే. వెస్టిండిస్ జట్టుతో టీమిండియా ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడనుంది.