హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే మంగళవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కోచ్ పదవి నుంచి కుంబ్లే వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో స్పందించారు.
ఈ నేపథ్యంలో వివిధ దేశాలకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు, తదితరులు ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. బీసీసీఐకి తల లేదని, టీమిండియాకు మెదడు లేదని ప్రముఖ కార్టూనిస్ట్ సతీశ్ ఆచార్య ఈ సందర్భంగా ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
వెస్టిండిస్ పర్యనటకూ కోచ్గా కొనసాగాలని బోర్డు కుంబ్లేని కోరినప్పటికీ... కుంబ్లే మాత్రం తక్షణం కోచ్గా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మంగళవారం తనకు పదవిలో కొనసాగే ఉద్దేశం లేదని తన రాజీనామా లేఖలో బోర్డుకు స్పష్టం చేశాడు.
కోచ్గా తన పద్ధతులపై కెప్టెన్కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కుంబ్లే పేర్కొన్న సంగతి తెలిసిందే. టీమిండియాకు కోచ్గా అనిల్ కుంబ్లే ఏడాది పాటు సేవలందించాడు. కుంబ్లే హయాంలో టీమిండియా నెంబర్ వన్ జట్టుగా నిలిచింది.
గతేడాది వెస్టిండీస్ పర్యటనతో కోచ్గా కుంబ్లే ప్రస్థానం ఆరంభమైంది. అక్కడ టెస్టు సిరీస్లో భారత్ 2-0తో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్ ఓడింది. కుంబ్లే హయాంలో భారత్ కోల్పోయిన ఏకైక ద్వైపాక్షిక సిరీస్ ఇదే. తర్వాత సొంతగడ్డపై భారత్ వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై సిరీస్లు గెలిచింది.
కోచ్గా కుంబ్లే చివరిసారిగా బాధ్యతలు నిర్వర్తించిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా రన్నరప్గా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 180 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే.