Anil Kumble: ఐపీఎల్ 2024 టైటిల్ను శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి కొత్త కెప్టెన్ అజింక్య రహానే నాయకత్వంలో కేకేఆర్ అద్భుతంగా రాణిస్తుందని ఊహించారు. కానీ ఇది ఇంకా జరగలేదు. కోల్కతా నైట్ రైడర్స్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేకేఆర్ 3 మ్యాచ్ల్లో గెలిచి 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. కేకేఆర్ పేలవమైన ప్రదర్శనపై భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే ప్రశ్నలు లేవనెత్తారు. ఆండ్రీ రస్సెల్ను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని కుంబ్లే భావిస్తున్నాడు.
కేకేఆర్పై అనిల్ కుంబ్లే ఆగ్రహం
జియో హాట్స్టార్లో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆండ్రీ రస్సెల్ను సరిగ్గా ఉపయోగించుకోవడం తాను భావిస్తున్నానని అన్నాడు. రస్సెల్ను ముందే బ్యాటింగ్కు పంపాలని.. అతనికి మరిన్ని అవకాశాలు రావాలని సూచించాడు. పంజాబ్తో కేకేఆర్ ఓడిపోయిన మ్యాచ్ లో కూడా అదే జరిగిందని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో డగౌట్లో నిర్ణయం ఇలా ఉండాలని అనిల్ కుంబ్లే చెప్పాడు. రస్సెల్ నువ్వు వెళ్లి త్వరగా ముగించడానికి ప్రయత్నించు.. మొదటి బంతికే నువ్వు ఔటైనా పర్వాలేదు.. మన దగ్గర ఇంకా కొంతమంది బ్యాటర్లు మిగిలి ఉన్నారని ప్రోత్సహించి ఉంటే బాగుండేదని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. కానీ అది జరగలేదని కుంబ్లే మండిపడ్డాడు.

ఆండ్రీ రస్సెల్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతను బౌలర్లతో కలిసి ఆడవలసి వచ్చిందన్నాడు. చివరి మ్యాచ్లో కూడా రస్సెల్ వచ్చే సమయానికి మ్యాచ్ దాదాపుగా ముగిసిందన్నాడు. ఓవర్కు 17 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు అవసరం ఉన్న సమయంలో వచ్చాడని చెప్పాడు. ఇది ప్రతిసారీ కాదు.. 10 లేదా 20 మ్యాచ్లకు ఒకసారి జరగవచ్చని తెలిపాడు. కాబట్టి కేకేఆర్ దీని గురించి ఆలోచించి ఒక పరిష్కారం కనుగొనవలసి ఉంటుందని తాను భావిస్తున్నట్లు అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు.
గత సీజన్లో 19 వికెట్లతో పాటు 222 పరుగులు చేసిన రస్సెల్ను కేకేఆర్ రూ. 12 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఒకప్పుడు ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించిన రస్సెల్.. ఇప్పుడు భారీ షాట్లు ఆడేందుకే తడబడుతున్నాడు. ఈ క్రమంలోనే రస్సెల్ పని అయిపోయిందని, అతన్ని తుది జట్టులో నుంచి తప్పించడం ఉత్తమమని అభిమానులు.. కేకేఆర్కు సూచిస్తున్నారు. ఈ సీజన్తోనే రస్సెల్ కెరీర్ ముగిసినట్లేనని, వచ్చే సీజన్లో అన్సోల్డ్గా నిలుస్తాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రస్సెల్ కారణంగా కేకేఆర్కు రూ. 12 కోట్ల బొక్క అని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన కేకేఆర్.. మూడు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో కేకేఆర్ ఇంకా 6 లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ 6 మ్యాచ్ల్లో ఐదు గెలవాలి. అప్పుడే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్ ఓడినా.. ఇతర జట్ల ఫలితాలు, నెట్రన్రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. మూడు ఓడితే మాత్రం అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.