
క్రికెట్లో ఏ ఫార్మాట్ అయినా సరే.. భారత్, పాకిస్తాన్ ఆడుతున్నాయంటే ఆ కిక్కే వేరు. అప్పుడది కేవలం ఒక క్రీడ కాదు. కోట్లాది ప్రజల గుండె చప్పుడుగా మారుతుంది. ఆ మ్యాచ్లో ప్రతి డెలివరీ ప్రేక్షకుల బ్లడ్ ప్రెషర్ పెంచుతుంది. అలాంటి ఘటనే సరిగ్గా 24 ఏళ్ల క్రితం జరిగింది. అంటే 1999 ఫిబ్రవరి 7వ తేదీన అన్నమాట. ఆ నాడు భారత్, పాకిస్తాన్ జట్లు టెస్టు మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. పాకిస్తాన్ ముందు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. ఈ ఛేజింగ్ను పాకిస్తాన్ కూడా ధాటిగానే ఆరంభించింది.
పాక్ ఓపెనర్లు ఇద్దరూ అద్భుతంగా ఆడుతూ భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. దాంతో ఆ జట్టు ఒకానొక దశలో 101/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇలాగైతే భారత్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. ఇలా అనుకున్నట్లే జరిగితే అది భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎందుకు అవుతుంది. ఆ మ్యాచ్లో కూడా ఎవరూ ఊహించని ఫలితమే వచ్చింది. పాక్ పటిష్ట స్థితిలో ఉండగా మాజీ లెజెండ్ అనిల్ కుంబ్లే బౌలింగ్కు వచ్చాడు. వరుస పెట్టి పాకిస్తాన్ వికెట్లు కూలుస్తూ ఆ జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు.
ఆ ఇన్నింగ్స్లో పాకిస్తాన్ అన్ని వికెట్లూ కుంబ్లేనే తీయడం గమనార్హం. ఈ మ్యాచ్లో కేవలం 74 పరుగులు ఇచ్చిన కుంబ్లే మొత్తం పదికి పది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ కూడా కుంబ్లేనే. కుంబ్లే ఈ రేంజ్లో విజృంభించడంతో పాకిస్తాన్ జట్టు కేవలం 207 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. దీంతో ఆ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది.