హైదరాబాద్: టీమిండియా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా సమర్పించిన తర్వాత కోహ్లీ-కుంబ్లేల మధ్య విభేదాలకు సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగు చూస్తోంది. కోచ్గా తన పద్ధతులపై కెప్టెన్కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో కుంబ్లే రాజీనామా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
కోహ్లీ వల్లే కుంబ్లే రాజీనామా చేశాడని తెలియడంతో సోషల్ మీడియాలో కోహ్లీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కుంబ్లేతో నెలకొన్న వివాదంపై విరాట్ కోహ్లీ కోహ్లీ ఎట్టకేలకు స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్లో చోటు చేసుకున్న విషయాలు ఎప్పటికీ బయటికి వెల్లడించలేనని తేల్చి చెప్పాడు.

కోచ్ పదవి నుంచి తప్పుకోవాలన్న కుంబ్లే నిర్ణయాన్ని గౌరవిస్తానని, అతడంటే తనకెంతో గౌరవముందని కోహ్లీ అన్నాడు. 'అనిల్ భాయ్ తన అభిప్రాయం చెప్పాడు. కోచ్గా వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం' అని కోహ్లీ చెప్పాడు.
అయితే కుంబ్లే-కోహ్లీల మధ్య విభేదాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం ఏమిటంటే అనిల్ కుంబ్లే ఆటగాళ్లను స్కూల్ పిల్లల మాదిరి ట్రీట్ చేయడం. దీనిని ఆటగాళ్లు ఎంత మాత్రం తట్టుకోలేకపోయారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
కుంబ్లే హెడ్ మాస్టర్లా వ్వవహరిస్తున్నాడని క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరభ్ గంగూలీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆటగాళ్లను కలిసిన సందర్భంలో ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు పాకిస్థాన్ చేతిలో ఫైనల్లో ఓడిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ఓ అరగంటపాటు జట్టు సభ్యులకు కుంబ్లే క్లాస్ తీసుకున్నాడు.
ఇది కూడా కోహ్లీకి నచ్చలేదు. ఫైనల్లో టీమిండియా చెత్త ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కుంబ్లే, మ్యాచ్ ముగిసిన వెంటనే ఓ ఆటగాడికి గట్టిగా క్లాస్ పీకాడట. వాస్తవానికి ఆటగాళ్లను ప్రశ్నించడం, వారి లోపాలను చెప్పడం, సలహాలివ్వడం కోచ్ విధుల్లో భాగమే అయినప్పటికీ, కుంబ్లే ఎంచుకున్న సమయం మాత్రం సరైంది కాదని అంటున్నారు.
ఆటగాళ్లు అప్పుడు జట్టు ఓడిన బాధలో ఉన్నారని తెలిపాడు. ముఖ్యంగా అలాంటి సమయంలో కోచ్ తప్పులెంచడం సరికాదని ఓ బీసీసీఐ అధికారి అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా వేసిన నో బాలే టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.