
బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే లాక్డౌన్ ఉండడంతో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 'కీపిటప్' ఛాలెంజ్ను తీసుకొచ్చాడు. ఈ ఛాలెంజ్ నిరంతరాయంగా కొనసాగుతోంది. భారత ఆటగాళ్లు ఒక్కొక్కరూ మిగతావాళ్లకి నామినేట్ చేస్తుండడంతో ఆ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కీపిటప్ ఛాలెంజ్ను స్వీకరిస్తున్న క్రికెటర్లు కొత్త పద్ధతుల్లో ట్రై చేసి అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే పింక్బాల్తో ఆ ఛాలెంజ్ స్వీకరించాడు. ఇక మాజీ సారథి అనిల్ కుంబ్లే ఒంటిచేత్తో ఆడి దాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు. రహానె కొత్తగా ట్రై చేసి ఆకట్టుకున్నాడు. పింక్బాల్తో ఆ ఛాలెంజ్ను పూర్తి చేసాడు. తన బ్యాటును గోడుగా తిప్పి ఛాలెంజ్ పూర్తి చేసాడు. ఇక శిఖర్ ధావన్, ఛతేశ్వర పుజారా, వృద్ధిమాన్ సాహాలకు పాస్ చేశాడు.
అనిల్ కుంబ్లే కూడా ఛాలెంజ్ను స్వీకరించి ఇంకో విధంగా ప్రయత్నించాడు. తన వద్ద బ్యాట్ లేకపోవడంతో జంబో ఒంటి చేత్తోనే బంతిని ఆడించాడు. ఛాలెంజ్ చేస్తూ.. నేను ఇంట్లోనే ఉన్నాను. మీరు కూడా ఉండండి. జాగ్రత్తగా ఉండి కరోనాను ఎదుర్కొందాం అని చెప్పాడు. ఈ వీడియోను ట్విటర్లో పంచుకొని వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్, కేఎల్ రాహుల్కు నామినేట్ చేశాడు. భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. అనిల్ కుంబ్లేను ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే.
తొలుత యువరాజ్ సింగ్ కీపిటప్ పేరుతో బ్యాట్ ఎడ్జ్పై బంతిని ఆడించే వీడియో తీసి.. దాన్ని రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్లకు నామినేట్ చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ దాన్ని వినూత్నంగా ప్రయత్నించి, కళ్లకు గంతలు కట్టుకొని ఛాలెంజ్ను పూర్తిచేశాడు. ఆయన మళ్లీ యువీకే నామినేట్ చేశాడు. ఇక రోహిత్ శర్మ.. యువరాజ్ చేసినట్లు చేసినట్లుగానే ఛాలెంజ్ స్వీకరించి రహానేకు నామినేట్ చేశాడు. ప్రస్తుతం ఈ కీపిటప్ ఛాలెంజ్ నెట్టింట్లో వైరల్ అయింది. క్రికెట్ ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా కీపిటప్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారు.