దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ అనిల్ కుంబ్లే మరోసారి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు కుంబ్లే ఈ పదవిలో కొనసాగుతారు. క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా కుంబ్లేను పునర్నియమిస్తూ ఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దుబాయ్ లో ఆరు రోజుల పాటు ఏర్పాటైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టులో లెగ్ స్పిన్ మాంత్రికుడిగా అనిల్ కుంబ్లేకు పేరుంది. 2012లో తొలిసారిగా ఆయన ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ నుంచి బాధ్యతలను తీసుకున్నారు. భారత్ తరఫున 18 సంవత్సరాల పాటు కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. 132 టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు. అలాగే 271 వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన రెండో ఆటగాడు కుంబ్లేనే కావడం విశేషం.