
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాదే జరుగుతుందని టీమిండియా మాజీ కెప్టెన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ ఫ్యాన్స్ లేకుండా ఖాళీ స్టేడియాల్లో జరుగుతుందని జంబో అన్నారు. వైరస్ కారణంగా దాదాపు మూడు నెలలుగా క్రీడాలోకం నిలిపోయింది. కరోనా దెబ్బకు అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది.
ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ అయి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠకు ఈ రోజు తెరపడే అవకాశం ఉంది. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణంగా ఈ మెగా టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2022కు వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని దేశాల బోర్డు సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పొట్టి ప్రపంచకప్ నిర్వహణ అంశంపై ఐసీసీ గురువారం చర్చించనుంది. వాయిదా వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రపంచకప్ వాయిదా పడనుండటంతో.. అక్టోబర్, నవంబర్ నెలల్లోఐపీఎల్ నిర్వహించుకోవడానికి మార్గం సుగుమం అవుతుంది.
ఇక అక్టోబర్ నెలలో ఐపీఎల్ 2020 నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై అనిల్ కుంబ్లే స్పందించారు. క్రికెట్ కనెక్టడ్ షోలో జంబో మాట్లాడుతూ... 'ఈ ఏడాదే ఐపీఎల్ 2020 జరుగుతుందని ఇప్పటికే నమ్మకం ఉంది. అయితే స్టేడియంలలో ప్రేక్షకులు ఉండే అవకాశం లేదు. మూడు లేదా నాలుగు వేదికలు ఉంటాయి. ఐపీఎల్ జరగడానికి ఇప్పటికీ అవకాశం ఉందనే అనిపిస్తుంది, ఎందుకంటే మనం అందరం ఆశావాదులమే' అని పేర్కొన్నారు.
ఉమ్మి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. ఇక మీదట మ్యాచ్ల సందర్భంగా బౌలర్లు ఉమ్మిని బంతిపై రుద్దకుండా నిషేధం విధిస్తూ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ ఐసీసీకి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బౌలర్లు ఈ నిర్ణయంతో బ్యాట్స్మెన్కు లాభం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైరస్ ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత తిరిగి ఉమ్మిని వాడవచ్చని కుంబ్లే స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తాత్కాలిక చర్యల్లో భాగంగానే ఆ ప్రతిపాదన చేశామని చెప్పుకొచ్చారు.
1990లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అనిల్ కుంబ్లే.. 132 టెస్టులాడి 619 వికెట్లు తీసారు. టెస్టు చరిత్రలో మన అనిల్ కుంబ్లే పదికి పది వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా జంబో నిలిచారు. 2008లో టెస్టులకి అనిల్ కుంబ్లే వీడ్కోలు పలికారు. కుంబ్లే తర్వాత అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్గా హర్భజన్ సింగ్ 417 వికెట్లతో ఉన్నాడు. ఇక జంబో 271 వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టారు.