హైదరాబాద్: మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ. 500లు, రూ. 1000 నోట్లను రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న భారత్లో పెను భూకంపాన్ని సృష్టిస్తోంది. ఈ నిర్ణయం నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటే... అటు సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
రూ. 500, 1000 నోట్లు నేటి నుంచే చెల్లవు: మోడీ
మోడీ తీసుకున్న నిర్ణయం బుధవారం టాప్ ట్రెండింగ్లో ఉంది. బుధవారం నాడు అమెరికా అధ్యక్ష ఫలితాలు వెలువడుతున్నా వాటిని ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరు. యావత్ భారతజాతితో పాటు ప్రపంచం కూడా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపైనే చర్చించుకుంటున్నారు.
మంగళవారం ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో రూ. 500, రూ. 1000 నోట్లు ఈ అర్ధరాత్రి నుంచి కేవలం కాగితాలు మాత్రమేనని, వాటికి ఏ మాత్రం విలువ ఉండదని అన్నారు. ఐదు, వేయి రూపాయల నోట్లను ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా అంటే వచ్చే 50 రోజుల్లోగా బ్యాంకులో గానీ పోస్టాఫీసులో గానీ జనమ చేయాలని ఆయన సూచించారు.

ప్రధాని మోడీ నిర్ణయంపై మంగళవారం రాత్రి సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు:
అమెరికాలో ఓట్ల కౌంటింగ్ జరుగుతుంటే.. ఇండియాలో నోట్ల కౌంటింగ్ జరుగుతోంది. భారత్లో ఈ రాత్రి చాలా ఇళ్లలో లైట్లు ఆఫ్ కావని ట్విట్టర్లో తనదైన శైలిలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
మోడీజీ.. మీరు సూపర్ సిక్సర్ కొట్టారు. ఇది నిజంగా చాలా గొప్ప నిర్ణయం. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉందని టీమిండియా స్పిన్నర్ హార్భజన్ సింగ్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
హ్యాట్సాఫ్ నరేంద్రమోడీజీ. ఈ నిర్ణయంతో కొత్త భారత్ పుడుతుంది. జై హింద్ అంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఇది నిజంగా ఓ అద్భుతమైన గూగ్లీ అంటూ టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ట్విట్టర్లో పేర్కొన్నారు.
రూ. 2000 నోటు రంగు పింక్ కలర్లో ఉంది. ఇదంతా పింక్ సినిమా ఎఫెక్ట్ అంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే వీరందరికి ప్రధాని మోడీ సమాధానం ఇచ్చారు. తమ బౌలింగ్ ద్వారా ఎంతో మంది బ్యాట్స్ మెన్లకు షాకిచ్చిన ప్రముఖ భారత క్రికెటర్లు స్పందన అంటూ రీట్వీట్ చేశారు. భారత సినీ పరిశ్రమకు చెందిన నాగార్జున, రజనీకాంత్, కమల్ హాసన్, అజయ్ దేవగన్, రితేశ్ దేశ్ ముఖ్, సుభాష్ ఘాయ్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరుల ట్వీట్లను కూడా ప్రధాని రీట్వీట్ చేశారు.