అంటిగ్వా : బంపర్ బోణీ ద్వారా కోచ్ గా తన సత్తా ఏంటో చాటాడు టీమ్ ఇండియా కోచ్ అనిల్ కుంబ్లే. విండీస్ తో టెస్టులో భాగంగా ఇంకో రోజు ఆట మిగిలి ఉండగానే టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీని నమోదు చేసుకోవడంతో.. కోచ్ కుంబ్లేపై పొగడ్తల వర్షం కురుస్తోంది.
టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టిన భారత స్పిన్నర్ అశ్విన్, ఆ తర్వాత బౌలింగ్ లో మాత్రం విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 25 ఓవర్లు బౌలింగ్ చేసినా.. వికెట్ల ఖాతా మాత్రం తెరవలేదు. అయితే ఇందుకు భిన్నంగా సెకండ్ ఇన్నింగ్స్ లో రెచ్చిపోయిన అశ్విన్ ఏకంగా 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు అశ్విన్.
కాగా, సెకండ్ ఇన్నింగ్స్ లో తన ప్రదర్శనకు సంబంధించి క్రెడిట్ అంతా కుంబ్లేదే అంటున్నాడు అశ్విన్. కోచ్ గా కుంబ్లే ఇచ్చిన సలహాలే తొలి ఇన్నింగ్స్ లో ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించేలా చేశాయని అంటున్నాడు. కోచ్ గా అనిల్ కుంబ్లే లాంటి వ్యక్తులు డ్రెస్సింగ్ రూమ్ లో ఉండడం తమకు కలిసి వస్తుందన్నాడు అశ్విన్.
బౌలింగ్ కు సంబంధించి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై కుంబ్లే ఇచ్చిన సలహాలే నాలుగో రోజు ఆటలో తనకు 7 వికెట్లు దక్కేలా చేశాయన్నాడు అశ్వన్. మ్యాచ్ అనంతరం బీసీసీఐ వెబ్ సైట్ ద్వారా కోచ్ కుంబ్లేపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు అశ్విన్. లైన్ అండ్ లెంగ్త్ విషయంలోను.. అలాగే అలసిపోకుండా ఉండాలంటే క్రీజులో కాస్త నెమ్మదిగా వ్యవహరించాలంటూ కుంబ్లే చేసిన సలహాలు తనకు కలిసొచ్చాయని చెప్పుకొచ్చాడు అశ్విన్.

ఇదిలా ఉంటే.. మొదటి ఇన్నింగ్స్ లో 243 పరుగులకే చాప చుట్టేసిన విండీస్, ఫాలో ఆన్ ఆడుతూ.. రెండో ఇన్నింగ్స్ లో 231 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 566/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో 2005లో ఇన్నింగ్స్ 90 పరుగులతో జింబాబ్వేపై టీమ్ ఇండియా సాధించిన విజయం, తాజా విజయంతో బద్దలైంది. ఆసియా వెలుపల టీమ్ ఇండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్: మొత్తం 161.5 ఓవర్లలో 566/8 డిక్లేర్డ్.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ : 90.2 ఓవర్లలో 243 ఆలౌట్.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 231 ఆలౌట్