హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేతో పాటు కోహ్లీ విభేదాలంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఓ సంఘటన చోటు చేసుకుంది. లండన్లో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరింది.
వెస్టిండిస్ పర్యటకు కూడా కోచ్గా కుంబ్లేనే కొనసాగుతాడని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముగించుకుని వెస్టిండిస్ పర్యటనకు వెళ్లే భారత జట్టుతో కోచ్ కోహ్లీ వెళ్లడం లేదు. మంగళవారం భారత జట్టు లండన్ నుంచి విండిస్ బయల్దేరితే కుంబ్లే మాత్రం లండన్లోనే ఉండిపోయాడు.

అయితే దీనికి ఓ కారణం ఉంది. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా ఉన్న కుంబ్లే.. ఐసీసీ వార్షిక సమావేశంలో భాగంగా కొన్ని రోజుల పాటు లండన్లోనే ఉండబోతున్నడనేది సమాచారం. క్రికెట్ గేమ్కు సంబంధించి కొత్త నిబంధనలు, చట్టాలు రూపొందించేది ఈ కమిటీయే.
జూన్ 19 వ తేదీన మొదలైన ఐసీసీ వార్షిక సమావేశాలు జూన్ 23 వరకూ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశాల్లో పాల్గొనడానికి కుంబ్లే వెస్టిండీస్ వెళ్లలేదని, మీటింగ్ పూర్తయిన తర్వాత వెళ్తాడని టీమ్ మేనేజ్మెంట్ సభ్యుడొకరు వెల్లడించారు. ఈ సమావేశాల్లో క్రికెట్కు సంబంధించి పలు కీలక అంశాలను చర్చించనున్నారు.
దీంతో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా మాత్రం బార్బడోస్ విమానం ఎక్కనుంది. విండిస్ పర్యటనకు ముందు క్రికెట్ సలహా కమిటీతో భేటీ అయిన కోహ్లీ కుంబ్లే తీరుపై మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కి ముందు శనివారం సాయంత్రం కెప్టన్ కోహ్లీ కమిటీ ముందు హాజరయ్యాడు.
ఈ సందర్భంగా కుంబ్లే తీరుతో తాను విసిగిపోయానని కోహ్లీ చెప్పినట్లు బీసీసీఐలోని ఓ అధికారి వెల్లడించాడు. కుంబ్లే విషయంలో తన ఉద్దేశం ఏంటో కోహ్లీ స్పష్టంగా చెప్పాడు. మరోవైపు కుంబ్లే ఇంకా కమిటీతో భేటీ కావాల్సి ఉంది. విండీస్ వెళ్లేలోపే కుంబ్లే సీఏసీని కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.