హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే కాంట్రాక్ట్ను పొడిగిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వెస్టిండీస్ పర్యటనకు కూడా అనిల్ కుంబ్లేని కోచ్గా బీసీసీఐ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ పరిపాలనా కమిటీ (సీఓఏ) ఛైర్మన్ వినోద్రాయ్ ప్రకటన చేశారు.
సోమవారం సీఓఏ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వెస్టిండీస్ పర్యటన వరకు టీమిండియా ప్రధాన కోచ్గా కుంబ్లేనే కొనసాగించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కోచ్ ఎంపికను వెస్టిండీస్ సిరీస్ వరకు వాయిదా వేయాలని కోరుతూ బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం రావడం ఆసక్తికరంగా మారింది. కుంబ్లేకు భారత కెప్టెన్ కోహ్లీకి విభేదాలు తలెత్తడంతో మార్పు అనివార్యమని అందరూ భావించినా బీసీసీఐ కుంబ్లే పదవి కాలన్ని పొడిగించింది. జూన్ 20తో టీమిండియా ప్రధాన కోచ్గా కుంబ్లే కాంట్రాక్ట్ ముగియనుంది.
అయితే తాజా నిర్ణయంతో మరి కొద్దిరోజులపాటు కుంబ్లే జట్టుతో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ నియామకం కోసం బీసీసీఐ ఇటీవలే దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కోచ్గా అనిల్ కుంబ్లేను కొనసాగించాలా? లేక మరొకరిని ఎంపిక చేయాలా? అనే విషయమై గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) మరికొంత సమయం కావాలని కోరిన సంగతి తెలిసిందే.
వెస్టిండిస్ పర్యటన తర్వాత గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా సంఘం కొత్త కోచ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముంది. జూన్ 23న వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుంది. వెస్టిండీస్తో ఐదు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ను భారత్ ఆడనుంది.
'వెస్టిండీస్ పర్యటనకు కుంబ్లేనే కోచ్గా వెళ్తాడు. అది స్వల్పకాలిక పర్యటన. కాబట్టి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కొత్త కోచ్ ఎంపికపై నిర్ణయం తీసుకునేవరకు కుంబ్లేతో సర్దుకుపోవాలని కోహ్లికి సూచించాం' అని బోర్డు అధికారి ఒకరు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.