హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఇంజమామ్ ఉల్ హాక్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు. ఇంగ్లాండ్ వేదికగా ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాక్ జట్టుతో పాటు సెలక్షన్ కమిటీలోని సభ్యులను ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ సన్మానించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పాక్ జట్టుతో పాటు జట్టుకి మద్దతుగా నిలిచిన సపోర్టింగ్ స్టాఫ్కి కూడా ప్రధాని నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టులోని ఒక్కో ఆటగాడితో పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా ఉన్న ఇంజమామ్ కూడా కోటి రూపాయలు అందుకున్నారు.
ఇక మిగతా సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు చొప్పున ప్రధాని నవాజ్ షరీఫ్ ఇచ్చారు. అయితే పాక్ జట్టుతో పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా ఉన్న ఇంజమామ్ ఒక్కడికే రూ. కోటి ఇవ్వడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఇంజమామ్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. 'అవార్డులు ఇవ్వమని మేము ఏమీ అడగలేదు. చాలా బాధగా ఉంది. నగదు ప్రోత్సాహకాన్ని అందుకోవడం పట్ల ఇలాంటి విమర్శలు చేయడం తగదు' అని ఇంజమామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'సెలక్టర్లు వారి వృత్తికి న్యాయం చేస్తారు. మేము గతంలో ఎంచుకున్న జట్టే ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను డ్రా చేసుకుంది. 70 ఏళ్ల తర్వాత వెస్టిండీస్పై సిరీస్ను గెలుచుకుంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. మేమంతా కలిసి చర్చించుకున్న తర్వాతే సర్ఫరాజ్ అహ్మద్ను పాక్ టెస్టు క్రికెట్ జట్టుకు సారథి బాధ్యతలు అందించాలని బోర్డుకి సూచించాం' అని ఇంజమామ్ అన్నారు.