బెంగళూరు: భారత వన్డే, టీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో గౌతమ్ గంభీర్ చేతులు కలపలేదంటూ ఇందుకు సంబంధించి మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. దీనిపై గంభీర్ స్పందించాడు. ఇరువురు క్రికెటర్లకు పడటం లేదని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
తాజాగా, ధోనీ చేయి కలిపినప్పటికీ గంభీర్ పట్టించుకోనట్లుగా వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గంభీర్ మంగళవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. తాము చేతులు కలిపిన ఫోటోలు కూడా పెట్టాడు.
గంభీర్ తీరును తప్పుపడుతూ పదేపదే చానళ్లు వీడియో చూపించడంపై మనస్తాపం చెందిన గంభీర్.. ఫోటోలు ట్విట్టర్లో పెట్టి.. తాను ధోనితో కరచాలనం చేస్తున్నట్టుగా ఆ ఫొటోల్లో ఉన్నాయని చూపించాడు.

ఈ కరచాలనం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కంటే పెద్ద చర్చనీయాంశమైందని, మీడియా మిత్రులారా చూడండి... క్వార్టర్స్ మ్యాచ్ అనంతరం నేను ధోనితో కరచాలనం చేశానని గంభీర్ ట్వీట్ చేశాడు.
కాగా, ధోనీ, గంభీర్ల మధ్య కోపతాపాలు తగ్గినట్లు లేదని, వీరిద్దరి అభిప్రాయ బేధాలు మరోసారి విజయ్ హజారే వన్డే టోర్నీ సందర్భంగా బయటపడ్డాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నెల 23న జార్ఖండ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీ నెగ్గిన తర్వాత ధోనీతో గంభీర్ వ్యవహరించిన తీరే ఆ విషయాన్ని బయటపెట్టిందని చెప్పారు.
మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న గంభీర్ జార్ఖండ్ జట్టు ఆటగాళ్లతో కరాచలనం చేసి ధోనీని మాత్రం మినహాయించాడని, ఆ మ్యాచ్లో ధోనీ ఎదురుపడ్డా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తూ గంభీర్ మిగతా ఆటగాళ్లతో కలిసిపోయిందని మీడియాలో వచ్చింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతోంది. కరచాలనం కోసం ధోనీ చేయి చాపినప్పటికీ గౌతం గంభీర్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయిన దృశ్యం వీడియోలో ఉంది. దీనిపై గంభీర్ ట్వీట్ చేశాడు.