ఢాకా: బంగ్లాదేశ్ లో గ్రామ స్థాయిలో కూడా క్రికెట్ ఆట సీరియస్ గా జరుగుతుంటుంది. మైదానంలో క్రికెట్ ఆడుతుండగా బ్యాట్స్ మన్ తాను ఔటయ్యాననే కోపంలో స్టంప్ ను గాల్లోకి విసరగా.. అది కాస్తా అక్కడికి దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తున్న మరో క్రికెటర్ మెడ, తల వెనుక భాగంలో తగిలింది. దీంతో అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు.
వెంటనే ఆ ఫీల్డర్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దురదృష్టకరమైన సంఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. మరణించిన ఫీల్డర్ వయస్సు 14 సంవత్సరాలు.

ఢాకాలో స్థానికంగా ఉన్న రెండు జట్ల నడుమ మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన ఆటగాడి పేరు ఫైజల్ హుస్సేన్ అని పేర్కొన్నారు. అయితే సదరు బ్యాట్స్ మన్ ఉద్దేశపూర్వకంగా స్టంప్ విసరలేదనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గత ఏడాది మే నెలలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 16 ఏళ్ల యువ బౌలర్ తాను వేసిన బంతి నోబాల్ కాదని అంపైర్ తో వాదిస్తుండగా.. బ్యాట్స్ మన్ కోపం వచ్చి స్టంప్ తో సదరు బౌలర్ ను కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.