మూడేళ్ల కిందట ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఓ షో షూటింగ్లో భాగంగా ఈ కారు ప్రమాదం జరిగింది. అయితే తీవ్రంగా గాయపడిన అతడు, అప్పుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ యాక్సిడెంట్ సమయంలో తాను అనుభవించిన భయంకరమైన క్షణాలను, బాధను తెలియజేశాడు ఫ్లింటాఫ్.
"ఒక క్షణం పాటు నేను చనిపోయానని అనిపించింది. నేను స్పృహలోనే ఉన్నా, కాని ఏమీ కనిపించట్లేదు. నా కళ్ల మీదకు టోపీ వచ్చేసింది. ఆ తర్వాత టోపీపైకి లేపి చూసేసరికి, నేను చనిపోలేదని అర్థమైంది. స్వర్గంలో లేనని తెలిసింది. నేను టాప్ గేర్ ట్రాక్ మీద ఉన్నాను. అయితే నా మొఖం పూర్తిగా గాయమైందనిపించింది. నేను భయంతో వణికిపోయాను. కారు బోల్తా కొట్టినప్పుడు నేలవైపు చూస్తూ ఇలా అనుకున్నా. ఇప్పుడు తల పక్కవైపు బలంగా తగిలితే మెడ విరిగిపోతుంది లేదా చనిపోతాను. కాబట్టి నేలవైపు ముఖం పెట్టి పెట్టేశాను. వెంటనే నేలకు తల తాకింది.
ఆ వెంటనే కార్ మళ్లీ తిరగబడింది. సుమారు 50 మీటర్ల దూరం వరకు నేలకు నా ముఖం రాసుకుంటూ వెళ్లింది. తర్వాత గడ్డి మీద పడిపోయాను."

చనిపోయే ఉంటే బాగుండేది..
"నిజంగా చెప్పాలంటే.. చనిపోయే ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే నొప్పిని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆ తర్వాత నన్ను నేను చంపుకో కూడదు అనుకున్నా. అయితే ఆయన ప్రస్తుతం సానుకూల దృక్పథంతో ఉన్నాను. రేపు సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. నా పిల్లలు నన్ను హత్తుకుంటారు. ఇప్పుడు నేను కాస్త మెరుగైన స్థితిలో ఉన్నాను." అని ఫ్లింటాఫ్ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నాడు.
బాగా దెబ్బతిన్నాయి...
"ఫ్లింటాఫ్ పై పెదవి, కింద పెదవి భాగాలు బాగా కోసుకుపోయాయి. కేవలం చర్మం కాదు, కండరాలు కూడా దెబ్బతిన్నాయి" అని ఫ్లింటాఫ్ ను చికిత్స చేసిన శస్త్రచికిత్స నిపుణుడు జహ్రాద్ హక్ అన్నాడు. కాగా, ఫ్లింటాఫ్ యాక్సిడెంట్ తో బీబీసీ ఆ షోను రద్దు చేసింది. ఫ్లింటాఫ్కు దాదాపు 9 మిలియన్ పౌండ్లను నష్టపరిహారంగా చెల్లించింది. ఈ ప్రమాదం 2022 డిసెంబర్ 13న జరిగింది.