వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్లో అబుదాబి నైట్ రైడర్స్ తరఫున రసెల్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం గల్ఫ్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రసెల్ సిక్సర్లతో హోరెత్తించాడు. 13 బంతుల్లో అజేయంగా 30 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గల్ఫ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (67; 48 బంతుల్లో) టాప్ స్కోరర్. అయితే జెయింట్స్కు శుభారంభమే దక్కలేదు. 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో జేమి స్మిత్ (1) ఔటవ్వగా కాసేపటికే కెప్టెన్ విన్స్ (11) ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన జోర్డాన్ (21; 27 బంతుల్లో)తో కలిసి క్రిస్ లిన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.

అయితే జొర్డాన్ స్లో ఇన్నింగ్స్ గల్ఫ్ జెయింట్స్ స్కోరుపై ప్రభావం చూపించింది. ఆఖర్లో ఉస్మాన్ ఖాన్ (23; 16 బంతుల్లో), హెట్మెయిర్ (19; 8 బంతుల్లో) దూకుడుగా ఆడటంతో జెయింట్స్ 161 పరుగులకు చేరుకుంది. అబుదాబి బౌలర్లలో ఇమాద్ వసీమ్ (2/31), రసెల్ (2/32) చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన అబుదాబి నైట్ రైడర్స్ 18.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గల్ఫ్ జెయింట్స్ క్రమశిక్షణ లేని బౌలింగ్ నైట్ రైడర్స్కు కలిసొచ్చింది. 20కు పైగా అదనపు పరుగులు పొంది కష్టపడకుండానే పవర్ప్లేలో నైట్ రైడర్స్ 62 పరుగులు సాధించింది. అయితే జెయింట్స్ బౌలర్లు కాస్త పుంజుకుని వికెట్లు వరుసగా సాధించారు.
106/2తో మెరుగైన స్థితిలో ఉన్న నైట్ రైడర్స్ కాసేపటికే 122/4తో నిలిచింది. అయితే 16 ఓవర్లకు నైట్ రైడర్స్ 131/4తో ఉన్నప్పుడు వరుణుడి రాకతో ఆటకు అంతరాయం ఏర్పడింది. అనంతం మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక రసెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మ్యాచ్ను త్వరగా ముగించాలని బౌండరీల మోత మోగించి జట్టును గెలిపించాడు.