
విశాఖపట్నం: మొన్నటికి మొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ 15వ ఎడిషన్ ముగిసింది. ఈ సీజన్లోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ టైటిల్ను ఎగరేసుకెళ్లింది. ఇప్పుడదే తరహాలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తెర మీదికి వచ్చింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఈ మెగా క్రికెట్ ఈవెంట్ను నిర్వహించబోతోంది. ఈ లీగ్ టోర్నమెంట్లో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. అచ్చంగా ఐపీఎల్ తరహాలోనే దీన్ని డిజైన్ చేసింది ఏసీఏ
జులై 6వ తేదీ నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆరంభం కానుంది. మ్యాచ్లన్నింటినీ విశాఖపట్నం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలోనే షెడ్యూల్ అయ్యాయి. సాయంత్రం 6 గంటలకు తొలి మ్యాచ్ ఉంటుంది. ఈ నెల 17వ తేదీన ఫైనల్ మ్యాచ్. టీ20 ఫార్మట్ మ్యాచ్లు ఇవన్నీ. ఐపీఎల్ తరహా టోర్నమెంట్ ప్రస్తుతం తమిళనాడు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్ 2016 టీఎన్పీఎల్ సాగుతోంది. మొత్తం ఎనిమిది జట్లు తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాయి.
ఈ సారి ఏపీలోనూ ఈ టోర్నమెంట్ క్రికెట్ ప్రేమికులను పలకరించనుంది. ఫ్రాంఛైజీల కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బిడ్డింగ్స్ను ఇదివరకే ఆహ్వానించింది. మొత్తం 27 ఎంట్రీలు వచ్చాయి. ఇందులో తొమ్మిదింటిని షార్ట్ లిస్ట్ చేసింది ఏసీఏ. చివరికి ఆరు ఫ్రాంఛైజీలను ఎంపిక చేసింది. రాయలసీమ కింగ్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్.. పేర్లతో ఫ్రాంజైలు ఏర్పాటయ్యాయి.
ఒక్కో ఫ్రాంఛైజీలో మొత్తం 20 మంది ప్లేయర్లు ఉంటారు. ఒక్కో ఫ్రాంఛైజీలో హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్, ఫిజియోతో పాటు మరో నలుగురు సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. ఈ ఆరు ఫ్రాంఛైజీలను వేర్వేరు రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు ఏర్పాటు చేశారు. రాయలసీమ కింగ్- దశరథ రామిరెడ్డి, ఉత్తరాంధ్ర లయన్స్- కేవీఆర్ ఎస్టేట్స్, గోదావరి టైటాన్స్- మాల్విన్ గ్లోబల్, కోస్టల్ రైడర్స్- సూర్య గ్రానైట్స్, బెజవాడ టైగర్స్- ఆంధ్రా హాస్పిటల్స్, వైజాగ్ వారియర్స్- పల్సస్ గ్రూప్ నెలకొల్పారు.