MI vs KKR: ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంకా గెలుపు రుచి చూడలేదు. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిపోయి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. మొదట సీఎస్కేపై, ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ పై చిత్తుగా ఓడింది. దీంతో ఆ జట్టు తీరుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఆ జట్టులోని స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కూడా దారుణంగా విఫలమవుతున్నాడు.
అసలు తాజాగా గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచు అయితే మరీ దారుణం. టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ (8), రియాన్ రికెల్టన్ (6) పరుగులు చేయలేక కుప్పకూలితే, మిడిలార్డర్ లో భారం మోయలేక చతికిల పడింది. సూర్యకుమార్ (48) ఒక్కడే రాణించగా.. తిలక్ వర్మ (39) దూకుడుగా ఆడలేదు, రాబిన్ మిన్జ్ (3) విఫలమయ్యాడు. లోయర్ ఆర్డర్ లో హార్దిక్ పాండ్య జిడ్డూ బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా ఆ జట్టు మరోసారి ఘోరంగా విఫలమైంది.

అయితే ఇప్పుడు ముంబయి జట్టు తన తర్వాత మ్యాచును కేకేఆర్ తో తమ హోం గ్రౌండ్ లో ఆడేందుకు సిద్ధమైంది. సోమవారం (మార్చి 31) సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖెడె స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. సొంత గడ్డపై ఆడబోతోండటం ముంబయికు కాస్త కలిసొచ్చే అంశం. హోం గ్రౌండ్ లో తమ తొలి మ్యాచ్ ఆడబోతుండడంతో ఈ మ్యాచ్కు ముందు గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. అందుకే సాయంత్రం 6:30 గంటలకే సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ నటి అనన్య పాండే విచ్చేసి డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేయనుంది.
కాగా, ఐపీఎల్ 2025 ఆరంభ వేడుకలను బీసీసీఐ ఎంతో గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆరంభ వేడుకల్లో షారుక్ ఖాన్, దిశా పటానీ సహా పలువురు తారలు హాజరై సందడి చేశారు. అలానే ఈ ఆరంభ వేడుకలను అక్కడితో ఆపేయకుండా, రోజుకో చోట అన్ని జట్ల హోం స్టేడియాల్లోనూ నిర్వహిస్తున్నారు. అలా ఇప్పుడు ముంబయి ఇండియన్స్ వంతు వచ్చింది.