
ముంబై: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్లకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సర్ప్రైజ్ ఇచ్చారు. అరంగేట్ర ఆరుగురు ఆటగాళ్లను ప్రశంసించడంతో పాటు వారికి ఖరీదైన కార్లను బహుమతులుగా ఇచ్చారు. ఆసీస్ పర్యటనలో అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకుర్, మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్, నవ్దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్లకు తమ కంపెనీ నుంచి థార్ ఎస్యూవీ (THAR SUV) కార్లను బహుమతులుగా ఇస్తున్నట్లు ఆనంద్ మహీంద్ర శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఆరుగురు ఆటగాళ్లు తమ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని, వీరివి నిజ జీవిత విజయగాథలని ఆనంద్ మహీంద్ర కొనియాడారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేలా భావి భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. యువత ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే వీరిని బహుమతులతో ప్రోత్సహించినట్లు మహీంద్ర తెలిపారు. ఆరుగురు ఆటగాళ్లకు సంబందించిన కొన్ని వివరాలను తాను ట్వీట్ చేసిన వీడియోలో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. ఆనంద్ మహీంద్రపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
గాయాల నేపథ్యంలోనే భారత్ ఎన్నడూ లేని విధంగా 20 మంది ఆటగాళ్లని ఆడించింది. ఇలా 1961-62 సీజన్ తర్వాత టీమిండియా ఇంతమందితో ఒక సిరీస్లో ఆడటం ఇదే తొలిసారి. 2014-15 ఆస్ట్రేలియా టూర్లో, 2018 ఇంగ్లండ్ పర్యటనలో, 1959 ఇంగ్లండ్ టూర్లో అత్యధికంగా 17 మందిని ఆడించింది. తొలి మూడు టెస్టుల్లో శుభ్మన్గిల్, మహ్మద్ సిరాజ్, నవ్దీప్సైనీ అరంగేట్రం చేయగా.. చివరి టెస్ట్లో నటరాజన్, సుందర్, శార్దూల్ (గతంలో ఒక మ్యాచ్ ఆడి గాయపడ్డాడు) సంప్రదాయక ఫార్మాట్ను ప్రారంభించారు.
బోర్డర్-గవాస్కర్ సిరీస్లో అరంగేట్ర ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని తొలి పర్యటనలోనే ఆకట్టుకున్నారు. సిరాజ్ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయగా.. నటరాజన్ అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి మంచి ప్రదర్శన చేశాడు. సుందర్ (62), శార్దూల్ (66) నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అర్ధ శతకాలతో రాణించారు. శుభ్మన్ గిల్ ఓపెనర్గా రాణించాడు. సైనీ తనవంతు పాత్ర పోషించాడు.