
భారత పేస్ బౌలింగ్ దళం అంటే
భారత పేస్ బౌలింగ్ దళం అంటే అప్పట్లో కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్లు మాత్రమే గుర్తుకొచ్చేవారు. కానీ, ఈ పరిస్థితిని 2018 సమూలంగా మార్చింది. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ రూపంలో ఇప్పుడు భారత పేస్ దళం బలంగానే ఉంది. ముఖ్యంగా బుమ్రా ఐపీఎల్లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా వెలుగులోకి వచ్చి, తన వైవిధ్యమైన బంతులతో భారత్కు అద్భుత విజయాలను అందిస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ తర్వాత టీమిండియాకు బుమ్రా ప్రధాన పేసర్గా మారాడు.

బుమ్రాను ఎంపిక అందరినీ ఆశ్చర్యపరిచింది
గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు బుమ్రాను ఎంపిక చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ ఎంపికకు ముందు ఏడాది వరకు అతడు ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడింది లేదు. దీంతో టెస్టుల్లో అతడిని తీసుకుని సాహసం చేస్తున్నారని అప్పట్లో మాజీలతో పాటు క్రికెట్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సఫారీ గడ్డపై మూడు టెస్టుల సిరిస్లో బుమ్రా 25.21 సగటుతో 14 వికెట్లు తీసి విమర్శకుల నోళ్లు మూయించాడు. భారత్ గెలిచిన చివరి టెస్టులో కెరీర్లో తొలిసారిగా ఐదు వికెట్లతో చెలరేగాడు.

మెల్బోర్న్ పిచ్పై కెరీర్లోనే ఉత్తమ గణాంకాలు
ఇక, ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రా అడిన ఐదు టెస్టుల్లోనూ 25.91 సగటుతో మరో 14 వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది కాలంలో బుమ్రా ఆడిన 9 టెస్టులు ఆడగా 21.02 సగటుతో 48 వికెట్లు తీసి అరంగేట్ర ఏడాది అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసీస్ పర్యటనలో మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డుని కూడా బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో 20 వికెట్లు తీసి క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాడు. మెల్బోర్న్ పిచ్పై కెరీర్లోనే ఉత్తమ గణాంకాలు (6/33)తో పాటు భారత్కు 292 పరుగుల భారీ ఆధిక్యం లభించంలో బుమ్రాదే కీలకపాత్ర. అలాగే ఆ మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్ ఆఖరి బంతికి స్లో యార్కర్తో షాన్ మార్ష్ను అవాక్కయ్యేలా చేసిన తీరు మ్యాచ్కే హైలెట్గా నిలిచింది.

పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ని మార్చుకోవడంలో
పరిస్థితులకు తగ్గట్టుగా తన బౌలింగ్ శైలిని మార్చుకోవడంలో బుమ్రా దిట్ట. ఇక, తన సహజ శైలిలో వేసే స్లో బంతులు, యార్కర్లు, రివర్స్ స్వింగ్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. బుమ్రా యార్కర్ వేశాడంటే ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మన్ ఏమరపాటుగా ఉంటే వికెట్ సమర్పించుకోవాల్సిందే. మెల్బోర్న్ టెస్టులో హ్యారిస్ను బౌన్సర్తో, షాన్ మార్ష్ను స్లో యార్కర్తో, హెడ్ను స్వింగ్తో, లియాన్ను 146.1 కిమీ వేగంతో పెవిలియన్కు చేర్చాడు. గతేడాది విదేశాల్లో భారత జట్టు నాలుగు టెస్టుల్లో నెగ్గింది. ఇందులో ప్రతీ మ్యాచ్లోనూ బుమ్రానే ఎక్కువ వికెట్లు పడగొట్టడం విశేషం.

మూడు ఫార్మాట్లలోనూ ప్రధాన బౌలర్గా
జోహెన్స్బర్గ్, ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన టెస్టుల్లో ఏడు వికెట్లు తీయగా అడిలైడ్లో ఆరు, మెల్బోర్న్లో తొమ్మిది వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మూడు ఫార్మాట్లలోనూ బుమ్రా జట్టు ప్రధాన బౌలర్గా ఎదిగాడు. ఇప్పటివరకు భారత్ తరుపున 44వన్డేలాడి 21.01 సగటుతో 78 వికెట్లు తీశాడు. ఇక 40 టీ20 మ్యాచ్లాడి 6.77 ఎకానమీ రేట్తో 48 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ ఎలాగో బౌలింగ్లో భారత్కు బుమ్రా అంత కీలకంగా మారాడు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్లో బుమ్రా కీలకపాత్ర పోషించే అవకాశం లేకపోలేదు.


Click it and Unblock the Notifications












