సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఢిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన సన్రైజర్స్ అంచనాలను అందుకుంటూ ఈ సీజన్లోనూ తుదిపోరుకు చేరింది. టైటిల్కు మరో అడుగు దూరంలో నిలిచింది. న్యూలాండ్స్ వేదికగా మంగళవారం జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్లో డర్బన్ సూపర్ జెయింట్స్పై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్ మలన్ (63; 45 బంతుల్లో) అర్ధశతకంతో సత్తాచాటాడు. కెప్టెన్ మార్క్రమ్ (30; 23 బంతుల్లో) రాణించాడు. డర్బన్ బౌలర్లలో మహరాజ్, జూ. దలా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో డర్బన్ సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. బార్ట్మన్, మార్కో జేన్సన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.

అయితే ఈ మ్యాచ్లో సన్రైజర్స్ కెప్టెన్ మార్క్రమ్ మెరుపు క్యాచ్ అందుకున్నాడు. గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ను ఒడిసిపట్టాడు. బార్ట్మన్ వేసిన నాలుగో ఓవర్లో స్మట్స్ మిడాన్ మీదుగా బౌండరీకి ప్రయత్నించాడు. కానీ మార్క్రమ్ స్టన్నింగ్ ఫీల్డింగ్ చేశాడు. అమాంతం గాల్లోకి ఎగిరి కుడిచేతితో సూపర్ మ్యాన్లా అందుకున్నాడు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. మరోవైపు స్మట్స్ ఇది నమ్మశక్యంగా లేదంటూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ వికెట్కు డర్బన్ సూపర్ జెయింట్స్కు గట్టిఎదురుదెబ్బలా మార్చింది. బార్ట్మన్ నాలుగో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ బ్రీట్జకీ (3; 5 బంతుల్లో)ని ఔట్ చేశారు. ఆ తర్వాత క్రీజులో వచ్చిన స్మట్స్ నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత డర్బన్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. వరుసగా వికెట్లు కోల్పోతూ మ్యాచ్ను చేజార్చుకుంది.
కాగా, ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది. ఇవాళ జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో పార్ల్ రాయల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ పోరులో విజేతతో గురువారం క్వాలిఫయర్-2లో డర్బన్ సూపర్ జెయింట్స్ పోటీపడనుంది. అనంతరం క్వాలిఫయిర్-2 విజేతతో సన్రైజర్స్ టైటిల్ కోసం అమీతుమి తేల్చుకుంటుంది.