భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి ఆటకు వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశం తరఫున గొప్పగా పోరాడిన ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు గురువారం గుడ్బై చెప్పాడు. ప్రపంచకప్-2026 ఆసియా జోన్ క్వాలిఫయిర్స్లో భాగంగా కువైట్తో జరిగిన మ్యాచ్ అనంతరం సాకర్ దిగ్గజం కన్నీటితో మైదానాన్ని వీడాడు. సహచర ఆటగాళ్ల అందించిన గాడ్ ఆఫ్ హానర్ మధ్య భావోద్వేగంతో గ్రౌండ్ నుంచి నిష్క్రమించాడు.
అయితే విజయంతో సారథి సునీల్ ఛెత్రికి ఘనంగా వీడ్కోలు పలకాలనుకున్న భారత జట్టుకు నిరాశ ఎదురైంది. కువైట్తో జరిగిన పోరు 0-0తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ హోరాహోరీగా సాగిన ఇరు జట్ల స్ట్రైకర్లు గోల్ను సాధించలేకపోయారు. కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ గోల్ కీపర్లు సత్తాచాటి నిలువరించారు. కాగా, మ్యాచ్ డ్రా ముగియడంతో మూడో రౌండ్కు భారత్ చేరుకోవడానికి పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి.

2005లో తొలిసారిగా భారత్కు ప్రాతినిథ్యం వహించిన 39 ఏళ్ల సునీల్ ఛెత్రి ఎన్నో విజయాలు అందించాడు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు గొప్పగా పోరాడాడు. 19 ఏళ్లు భారత ఫుట్బాల్ ముఖచిత్రంగా మారాడు. ఈ క్రమంలో ఎన్నో ఘనతలు, రికార్డులు సాధించాడు. 151 మ్యాచ్ల్లో 94 గోల్స్ కొట్టాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా నిలిచాడు.
జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ సాధించిన నాలుగో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. క్రిస్టియానా రొనాల్డో (128), అలీ దాయ్ (109), లియోనల్ మెస్సీ (106) టాప్-3లో ఉన్నారు. ఆటలో సంచనాలు సృష్టించిన సునీల్ ఛెత్రికి అవార్డులతో పాటు పౌర పురస్కారాలు కూడా దక్కాయి. 2011లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీ, 2021లో ఖేల్రత్న పురస్కారాలు ఛెత్రి అందుకున్నాడు.
ఫ్యామిలీ అంతా ఫుట్బాల్ ప్లేయర్లే
సునీల్ ఛెత్రి 1984లో సికింద్రాబాద్లో జన్మించాడు. అయితే ఛెత్రి కుటుంబం మొత్తం ఫుట్బాల్ ప్లేయర్లే కావడం విశేషం. ఆయన తండ్రి కేబీ ఛెత్రి, తల్లి సుశీల సాకర్ ప్లేయర్లే. కాగా, తల్లి సుశీల నేపాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. ఇక ప్రముఖ పుట్బాలర్ సుబ్రతో భట్టాచార్య కుమారై సోనమ్ను 2017లో ఛెత్రి వివాహం చేసుకున్నాడు.