
ఎఫ్ఐఆర్ నమోదు:
'క్రికెటర్గా ఎంఎస్ ధోనీకి, బిల్డర్గా అనిల్ శర్మకు దేశంలో ఎంతో పేరుంది. ఈ ఇద్దరిపై ఉన్న నమ్మకంతోనే ఆమ్రపాలిలో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు చెల్లించాం. నేరపూరిత కుట్రలో ధోనీ కూడా భాగమే. ఎఫ్ఐఆర్లో అతని పేరును కూడా చేర్చాము' అని సదరు భాధితులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సోమవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

అనేక కంపెనీలకు నిధుల మల్లింపు:
ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూప్నకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించాడు. 2009 నుంచి 2016 వరకు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు. అయితే ఫ్లాట్లు విక్రయిస్తామంటూ అనేక మంది వద్ద సొమ్ములు సేకరించిన సంస్థ.. ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా అనేక కంపెనీలకు మళ్లించింది. ఇందులో ధోనీ భార్య సాక్షికి చెందిన కంపెనీ కూడా ఉంది.

జైలుకు ఆమ్రపాలి డైరెక్టర్లు:
డిపాజిట్లు తీసుకున్న ఆమ్రపాలి కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం ఓనర్లకు ఫ్లాట్లు అప్పజెప్పలేదనే ఫిర్యాదులు అందడంతో.. 2017లో సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. ఆమ్రపాలి సంస్థ ప్రజల డబ్బును వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలకు బదిలీ చేసినట్టు తేలింది. ప్రజలను మోసం చేసిన కేసులో ఆమ్రపాలి డైరెక్టర్లను జైలుకు కూడా పంపింది.

రూ.40 కోట్లు చెల్లించలేదు:
2009 నుంచి 2016 వరకు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు తనకు చెల్లించాల్సిన రూ.40 కోట్ల బకాయిలను ఆమ్రపాలి గ్రూప్ చెల్లించలేదని గత ఏప్రిల్ నెలలో ధోనీ కోర్టుకు నివేదించాడు. మరోవైపు రాంచీలోని ఆమ్రపాలి సఫారిలో పెంట్హౌస్ను తాను బుక్ చేసుకున్నానని.. ఇంతవరకూ పెంట్హౌస్ను తనకు అప్పగించలేదని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ధోనీతో జరిగిన అన్ని లావాదేవీల వివరాలను తమకు నివేదించాలని సుప్రీం కోర్టు ఆమ్రపాలి గ్రూప్ను ఆదేశించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












