హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో స్పందించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి వాస్తవాలు ఒప్పుకున్నందుకు ఆసీస్ మీడియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుని ఆసీస్ మీడియా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న కోహ్లీని జంతువులతో పోల్చిన ఆసీస్ మీడియా మంగళవారం విరాట్ కోహ్లీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పోల్చిన సంగతి తెలిసిందే.

'ఆస్ట్రేలియా విరాట్ కోహ్లీని డొనాల్డ్ ట్రంప్తో పోల్చింది. థాంక్యూ ఆస్ట్రేలియా మొత్తానికి విరాట్ కోహ్లీని విన్నర్గా, ప్రెసిడెంట్' అని ఒప్పుకున్నందుకు ఆస్ట్రేలియా మీడియా ధన్యవాదాలు తెలుపుతూ అమితాబ్ ట్వీట్ చేశారు. తాను రెండు చేతులతో నమస్కరిస్తున్న ఫొటో కూడా ట్విటర్లో పోస్టు చేశారు.
బెంగుళూరులో జరిగిన రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ రివ్యూపై కోహ్లీ స్పందించినప్పటి నుంచి విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా కోహ్లీని వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లోకెక్కిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పోల్చింది.
'ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లి మరో డొనాల్డ్ ట్రంప్గా మారాడు. ఎందుకంటే ట్రంప్లాగే తాను కూడా ముఖంపై ఉన్న కోడి గుడ్డు మరకలను దాచుకుంటూ మీడియాను అవమానపరచాలని నిర్ణయించుకున్నాడు' అని ది డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కోహ్లీకి అమితాబ్ బచ్చన్ అండగా నిలిచారు.
బెంగుళూరు టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వివాదంలో కోహ్లీసేన సాక్ష్యాధారాలతో నిరూపించడంతో ఆస్ట్రేలియన్ల తలెత్తుకోలేకపోయారు. ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా పరువు పోయింది. దీంతో వీరికి మద్దతిచ్చేందుకు అక్కడి మీడియా కోహ్లీపై ఉన్నవీ లేనివీ రాయడం ప్రారంభించింది.