న్యూఢిల్లీ: ప్రపంచ టీ20 టోర్నీలో భాగంగా శనివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మ్యాచ్ గెలిచిన తర్వాత బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పోస్ట్ చేసిన సెల్ఫీ అందరినీ ఆకట్టుకుంది. ఇతర సినీ తారలు కూడా తమ సెల్ఫీలు దిగి టీమిండియాకు మద్దతు తెలిపారు.
కాగా, 'బచ్చన్ బాయ్స్ ఇన్ ద హౌస్... లెట్స్ డూ దిస్ ఇండియా' అంటూ అమితాబ్, అభిషేక్ సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు. బాలీవుడ్ సెలబ్రెటీలతోపాటు టాలీవుడ్ తారలు కూడా సోషల్ మీడియా ద్వారా టీమిండియాకు మద్ధతు తెలిపారు.
బాలీవుడ్ తారలు ప్రియాంకా చోప్రా, హృతిక్ రోషన్, షారూక్ ఖాన్, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, శ్రద్ధా కపూర్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. క్రికెట్ను ఎంతగానో అభిమానించే టాలీవుడ్ హీరో వెంకటేష్ కూడా టీమిండియాకు మద్ధతుగా నిలిచారు. గెలిచిన తర్వాత కూడా వెంకీ టీమిండియాకు విషెస్ చెప్పాడు.
Amazing gesture by Virat Kohli. #IndVsPak
Posted by Venkatesh Daggubati onSaturday, March 19, 2016
ఫీజు తీసుకొని అమితాబ్
పాకిస్తాన్ తో శనివారం ఈడెన్ గార్డెన్ లో భారత్ తో జరిగిన వరల్డ్ టీ 20 మ్యాచ్లో భాగంగా జాతీయ గీతాన్ని ఆలపించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎటువంటి పారితోషికం తీసుకోలేదని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) తాజాగా స్పష్టం చేసింది. తమ ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమానికి ఆయన స్వచ్ఛందంగానే హాజరైనట్లు పేర్కొంది.
ఈడెన్ గార్డెన్ స్టేడియంలో మ్యాచ్ కు ముందు జరిగిన జాతీయ గీత ఆలాపన కార్యక్రమానికి హాజరైన బిగ్ బి రూ. 4 కోట్లు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కొంతమంది అభిమానులు అడిగిన ప్రశ్నలకు క్యాబ్ సీనియర్ అధికారి స్పందిస్తూ.. బిగ్ బి అమితాబ్ కు తాము ఎటువంటి పారితోషికం ఇవ్వలేదని, ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.
చివరకు అమితాబ్ విమాన టికెట్లతో పాటు, హోటళ్ల బిల్లుల విషయంలో కూడా ఆయన తన సొంత నగదునే ఖర్చు పెట్టినట్లు ఈ సందర్భంగా క్యాబ్ అధికారి స్పష్టం చేశారు.
సినీ ధోనీతో ధోనీ సంబరాలు
శనివారం టీమిండియా విజయాన్ని పురస్కరించుకుని టీమిండియా కెప్టెన్ ధోనీ.. తన జీవిత చరిత్రతో బాలీవుడ్లో తెరకెక్కుతున్న ఎంఎస్ ధోనీ చిత్రంలో హీరో అయిన సుశాంత్ రాజ్పుత్తో సెల్ఫీ దిగి సందడి చేశారు. మహేంద్రసింగ్ ధోని నిజ జీవితంపై బాలీవుడ్లో నీరజ పాండే 'ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరి' చిత్రం రూపొందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇందులో ధోని పాత్ర నటిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్.. ఈడెన్ గార్డెన్లో రియల్ ధోనీతో కలిసి విజయానందాన్ని పంచుకున్నారు. పాక్తో మ్యాచ్ గెలిచిన తర్వాత ధోనితో కలిసి సంబరాలు చేసుకున్న ఫొటోను సుశాంత్ రాజ్పుత్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.