
హైదరాబాద్: క్రికెట్ అభిమానులే కాదు, సగటు వీక్షకుడికి సైతం ఊహించని రీతిలో భారత జట్టు విజయాన్ని నమోదు చేసుకుంది. ఉత్కంఠ పోరులో భారత్ను విజేతగా నిలిపిన దినేశ్ కార్తీక్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆదివారం శ్రీలంకలోని కొలంబో వేదికగా మ్యాచ్ జరిగింది. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఆఖరి బంతికి ఐదు పరుగులు తీయాల్సి ఉండగా కేవలం ఒక్క సిక్స్తో ట్రోఫీ చేతికొచ్చింది.
అతని ఆటతీరుకు మెచ్చి పలువురు ప్రముఖులు సోషల్మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. 'వాట్ ఏ గేమ్.. వాట్ ఏ ప్లేయర్..' అంటూ అందరూ కామెంట్లు పెడుతున్న తరుణంలో ఆయన వైవిధ్యాన్ని ప్రదర్శించాలని తడబడ్డారు.
టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ అతని స్కోరు గురించి తప్పుగా ఓ ట్వీట్ చేశారు. కానీ అందులో సంఖ్యలు తప్పుగా రాయడంతో, దినేశ్ కార్తీక్కు క్షమాపణలు చెబుతూ మరో ట్వీట్ చేశారు. అమితాబ్ ఇంతకుముందు ఇలా మహిళా క్రికెటర్లనుద్దేశించి తప్పుగా ట్వీట్ చేసి మళ్లీ సరిచేసుకున్నారు. అప్పుడు ఇలానే క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు.
శంకర్ను ముందు పంపడంపై కెప్టెన్ వివరణ:
బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం దినేశ్ కార్తిక్ నాలుగో డౌన్లో(98 పరుగుల వద్ద రోహిత్ ఔటైన తర్వాత) రావాల్సింది. అనూహ్యంగా దినేశ్ కార్తీక్కు బదులు శంకర్ను పంపడంపై కెప్టెన్ రోహిత్ వివరణ ఇచ్చాడు. 'కీలకమైన తరుణంతో అనుభవమున్న ఆటగాడి అవసం చాలా ఉంటుంది. మ్యాచ్ను విజయవంతంగా ముగించగల సత్తా కార్తీక్కు ఉందని నేను గట్టిగా నమ్మాను. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపాం. అనుకున్నట్లే డీకే తనదైన నైపుణ్యంతో రాణించాడు' అని రోహిత్ తెలిపాడు.