జింబాబ్వే పర్యటనలో భారత జట్టును విజయవంతంగా నడిపించిన తాత్కాలిక సారథి శుభ్మన్ గిల్ గురించి మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్కు కెప్టెన్సీ చేయడం రాదని అన్నాడు. ఓ బ్యాటర్గా గిల్ ఆకట్టుకుంటాడని, కానీ సారథిగా మాత్రం అతనికి అవగాహన లేదని మిశ్రా తెలిపాడు. భారత జట్టులో ఉన్నాడనే కారణంతో గిల్కు కెప్టెన్సీ ఇవ్వడం సరికాదని పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్ కప్ అనంతరం జింబాబ్వేతో టీమిండియా అయిదు టీ20ల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో యువ ఆటగాళ్లు జింబాబ్వేకు వెళ్లారు. తొలి మ్యాచ్ ఓడినప్పటికీ గిల్ సేన మిగిలిన మ్యాచ్ల్లో సత్తాచాటి 4-1తో సిరీస్ను ఘనంగా ముగించింది. కానీ గిల్ నాయకత్వంపై అమిత్ మిశ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే టీ20 వరల్డ్ కప్లో రిజర్వ్ ప్లేయర్గా గిల్ను ఎంపిక చేయడం కూడా సరైన నిర్ణయం కాదని మిశ్రా పేర్కొన్నాడు.

గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేయాల్సిందని అమిత్ మిశ్రా అభిప్రాయపడ్డాడు. సందర్భాన్ని బట్టి గేర్ను మార్చే రుతురాజ్ను మొదటి ఎంపికగా భావించాల్సిందని అన్నాడు. ''గిల్ను ఐపీఎల్లో చూశాను. అతన్ని కెప్టెన్గా నియమించడాన్ని అంగీకరించలేను. కెప్టెన్సీ ఎలా చేయాలో గిల్కు తెలియదు. దాని గురించి ఐడియా కూడా లేదు. భారత జట్టులో ఉన్నాడనే కారణంతో అతన్ని సారథిగా ఎంపిక చేయకూడదు. ఐపీఎల్లో, టీమిండియాలో గత కొన్నాళ్లుగా గిల్ రాణించాడు. అయితే కెప్టెన్గా అనుభవం రావాలని, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున సారథిగా ఆకట్టుకోలేకపోయినా గిల్కు అవకాశం ఇచ్చారు''
''ఇక గిల్ వర్సెస్ రుతురాజ్ గురించి మాట్లాడాలంటే.. నేను గిల్కు వ్యతిరేకిని కాదు. గిల్ ఆటను అభిమానిస్తా. కానీ రుతురాజ్ గిల్ కంటే బెటర్ ప్లేయర్. పరిస్థితిని బట్టి రుతురాజ్ బ్యాటింగ్ చేస్తాడు. సీఎస్కే తరఫున, ఏషియన్ గేమ్స్లో కెప్టెన్గా అతను సత్తాచాటాడు. టీ20 వరల్డ్ కప్లో బ్యాకప్ ప్లేయర్గా రుతురాజ్ను ఎంపిక చేయాల్సింది. అతను సంపూర్ణమైన ఆటగాడు. జట్టులో ప్రశాంతత తీసుకువస్తాడు. అనవసరంగా ఎలాంటి రిస్క్ షాట్లను ఆడడు. అతను మూడు ఫార్మాట్లు ఆడగలడు'' అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.