స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిశ్రా చర్చనీయాశంమైన విషయాలు చెప్పాడు. డబ్డు,ఫేమ్తో కోహ్లి మారిపోయాడని, రోహిత్ శర్మ వ్యక్తిత్తత్వం భిన్నమంటూ వ్యాఖ్యానించిన అమిత్ మిశ్రా.. కోహ్లి గురించి నెగటివ్గా మరికొన్ని విషయాలు పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. మ్యాచ్ ముగిసిన అనంతరం అప్పటి లక్నో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఒకరిపైనొకరు దూసుకెళ్లారు.అయితే గొడవకు అసలు కారణాలను అమిత్ మిశ్రా వివరించాడు.

ఆ మ్యాచ్లో ఓటమిపాలైన లక్నో ఛేదన చేయగా, అమిత్ మిశ్రా ఆఖరి వరకు క్రీజులో ఉన్నాడు. కోహ్లినే గొడవ మొదలుపెట్టాడని అమిత్ మిశ్రా తెలిపాడు. ''కోహ్లినే మా ఆటగాళ్లను దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. కైల్ మేయిర్స్తో ఎలాంటి గొడవ కోహ్లికి లేదు. కానీ మేయర్స్ను కూడా కోహ్లి తిట్టాడు. బౌలింగ్ చేస్తున్న నవీనుల్ హక్పై కోహ్లి నోరుపారేసుకున్నాడు. ఎన్నో విషయాలను వదిలి వేయొచ్చు. కానీ కోహ్లి అలా చేయలేదు''
''అంతకముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అభిమానులు అతిచేయడంతో నిశ్శబ్ధంగా ఉండమని గంభీర్ నోటిపై వేలు పెట్టి చూపించాడు. అది విరాట్ కోహ్లికి నచ్చదు. అది ఆ మ్యాచ్తోనే ముగిసిందని భావించాం. కానీ కోహ్లి అక్కడితో ఆగడని తర్వాత తెలిసింది. కొన్ని రోజుల తర్వాత ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం అసలు గొడవ మొదలైంది''
''హ్యాండ్ షేక్ ఇస్తున్న సమయంలో కోహ్లి ఆటగాళ్లను దుర్భాషలాడాడు. దీంతో గంభీర్ జోక్యం చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఎందుకు మళ్లీ మొదలుపెడుతున్నావని గంభీర్ అన్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి గంభీర్ను నేను తీసుకుని వెళ్లాను. నవీనుల్ డ్రెస్సింగ్ రూమ్కు వచ్చిన తర్వాత కోహ్లిని మళ్లీ తిట్టాడని చెప్పాడు. ఇది ముగిసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ కోహ్లిని నవీనుల్ తిరిగి మర్యాద ఇస్తాడని భావిస్తున్నారా? ఇతర ప్లేయర్లను పెద్ద ఆటగాళ్లు తిట్టడాన్ని చూసి యువ ఆటగాళ్లు ఏం అర్థం చేసుకుంటారు?'' అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.