ధావన్ విరాళం:
శిఖర్ ధావన్ గురువారం ఓ ట్వీట్ చేసాడు. 'అందరికి నమస్కారం. మీరు, మీ కుటుంబసభ్యుల సంక్షేమం కోసం దయచేసి ఇంట్లోనే ఉండండి. ప్రధానమంత్రి సహాయనిధికి నావొంతు సహాయాన్ని అందించాను. మీరు కూడా మీకు తోచిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని కోరుతున్నాను' అని ట్వీట్ చేశాడు. దీంతో పాటు ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చే వెబ్సైట్ని జత చేశాడు. అయితే తాను ఎంత మొత్తాన్ని విరాళంగా అందించాడనే విషయాన్ని మాత్రం ధావన్ చెప్పలేదు.
సింధు సాయం:
ధావన్తో పాటు మరికొందరు క్రీడాకారులు కూడా ఇప్పటికే తమ వంతు సహాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధులకు అందించారు. సింధు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సహాయనిధులకు చెరో రూ.5 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కోల్కతాలో ఇబ్బందులకు గురవుతున్న పేద ప్రజలకు సాయం చేయడానికి గంగూలీ రూ.50 లక్షల విలువైన బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే బజరంగ్ పూనియా (6 నెలల జీతం), గౌతమ్ గంభీర్ (రూ.50 లక్ష్యలు) విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
21 రోజుల పాటు లాక్డౌన్:
కరోనా విస్తృతంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో.. సమాజంలోని పేద, మధ్య తరగతికి చెందిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. వీరిని ఆదుకొనేందుకు, కరోనా వ్యాధికి చికిత్స అందించేందుకు గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా ప్రధానమంత్రి సహాయనిధికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.