టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ముంబయి ఇండియన్స్ తరపున బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాడు. ఇటీవల రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ జెండా కప్పుకున్నాడు. అయితే కొన్ని రోజుల్లోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశాడు.
''వైఎస్సార్సీపీ పార్టీ నుంచి వైదొలుగుతున్నాను. కొంత కాలం నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. భవిష్యత్తు కార్యచరణను త్వరలో ప్రకటిస్తాను'' అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో అంబటి రాయడుపై విమర్శలు వచ్చాయి. రాజకీయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడని, ఇలానే దూకుడుగా వ్యవహరించి క్రికెట్ కెరీర్ను నాశనం చేసుకున్నాడని, పొలిటికల్ ఇన్నింగ్స్లో హిట్ వికెట్గా డకౌటయ్యాడని కామెంట్లు వచ్చాయి.

అయితే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి గల కారణాలను వివరిస్తూ అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే సమయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని, దాని కోసమే పార్టీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు. ''దుబాయ్ వేదికగా జనవరి 20 నుంచి జరగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ముంబయి ఇండియన్స్ తరపున బరిలోకి దిగుతున్నాను. ప్రొఫెషనల్ ఆటను ఆడే సమయంలో నేను రాజకీయాల్లో ఉండకూడదు'' అని రాయుడు ట్వీట్ చేశాడు.
కాగా, ఐపీఎల్లో గతేడాది అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. లీగ్ జరుగుతున్న సమయంలోనే 2023 ఐపీఎల్ సీజనే తన ఆఖరిదని ప్రకటించాడు. ఆ సీజన్లో సీఎస్కే ధోనీ సారథ్యంలో టైటిల్ సాధించింది. చెన్నై విజేతగా నిలవడంలో అంబటి రాయుడు కీలక పాత్ర పోషించాడు. అనంతం ట్రోఫీ అందుకొని ఎమోషనల్ అయ్యాడు.
మరోవైపు దుబాయ్ వేదికగా జరగనున్న ILT20 జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఆరు జట్లు తలపడే ఈ టోర్నీ ఫిబ్రవరి 17 వరకు జరగనుంది. ముంబయి జట్టుకు నికోలస్ పూరన్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాగా, ముంబయి ఫ్రాంచైజీలో అంబటి రాయుడు పదేళ్ల పాటు ఆడాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరపునే రాయుడు అరంగేట్రం చేశాడు.