హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఓపెనింగ్కు పంపి చెన్నై కెప్టెన్ ధోని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. ఆటపై పూర్తిగా దృష్టి పెట్టి, అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నానని తెలిపాడు. శారీరకంగా ఫిట్గా ఉండేందుకే తాను ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి వైదొలిగినట్లు అంబటి రాయుడు పేర్కొన్నాడు.
లాస్ ఏంజెల్స్లో ధోని అభిమాని: సోషల్ మీడియాలో ఫోటో వైరల్
జూనియర్ చెన్నై కింగ్స్ ఇంటర్ స్కూల్ టీ20 టోర్నమెంట్ 2018 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాయుడు మాట్లాడుతూ "మరింత కాలం క్రికెట్లో కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నాకిప్పుడు 33 ఏళ్లు. గతంలో మోకాలి గాయానికి శస్త్రచికిత్స జరిగింది. రాబోయే రోజుల్లో క్రికెట్కు నా శరీరాన్ని సిద్ధంగా ఉంచుకునేందుకు" అని అన్నాడు.
రాబోయే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమేనని చెప్పిన అంబటి రాయుడు, అయితే ఇతర పద్ధతుల ద్వారా దానిని భర్తీ చేయొచ్చని అన్నాడు. వెస్టిండిస్ జట్టు భారత్లో పర్యటించినప్పుడు నాలుగో స్థానంలో బరిలోకి దిగిన అంబటి రాయుడు నిలకడగా ఆడటంతో పాటు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
దీంతో వన్డేల్లో నాలుగో నెంబర్ స్థానానికి రాయుడు చక్కగా సరిపోతాడని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ సిరిస్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రాయడు మాట్లాడుతూ "ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు సన్నాహాల్లో ఉన్నాను. ఏ స్థానంలో దిగాలనేదానిపై ఆలోచించను. ఆటపైనే దృష్టిపెట్టి మెరుగు పర్చుకునే ప్రయత్నంలో ఉన్నా" అని అన్నాడు.