ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఈ సీజన్లో ఓ దశలో తొలి ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం ఒకే విజయం సాధించిన ఆర్సీబీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. కానీ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
దీంతో 17 ఏళ్ల కప్ కల మరోసారి కలగానే మిగిలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (34; 22 బంతుల్లో, 2x4, 2x6), విరాట్ కోహ్లి (33; 24 బంతుల్లో, 3x4, 1x6), మహిపాల్ లోమ్రర్ (32; 17 బంతుల్లో, 2x4, 2x6) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/44) మూడు, అశ్విన్ (2/19) రెండు వికెట్లు తీశారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (45; 30 బంతుల్లో, 8x4), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో, 2x4, 2x6), హెట్మెయిర్ (26; 14 బంతుల్లో, 3x4, 1x6) విజయంలో కీలక పాత్ర పోషించారు. సిరాజ్ (2/33) రెండు వికెట్లు తీశాడు.
అయితే ఆర్సీబీ ఓటమిపై మాజీ క్రికెటర్ అంబటి రాయడు తీవ్ర విమర్శలు చేశాడు. సంబరాలు, దూకుడుతో ఐపీఎల్ ట్రోఫీలను గెలవలేరని, కీలక మ్యాచ్ల్లో విజయం సాధించాలని ఎద్దేవా చేశాడు. ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయానంతరం ఆర్సీబీ జట్టుతో పాటు అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు.
దీన్ని ఉద్దేశిస్తూ సీఎస్కే మాజీ క్రికెటర్ రాయుడు ఆర్సీబీని ట్రోల్ చేశాడు. ''సంబరాలు, దూకుడుతో ఐపీఎల్ ట్రోఫీలు గెలవలేరు. టైటిల్ సాధించాలంటే ప్లేఆఫ్స్లో బాగా ఆడాలి. కీలక మ్యాచ్లు గెలవాలి'' అని రాయుడు అన్నాడు. అయితే రాయుడు వ్యాఖ్యలను ఆర్సీబీ అభిమానులు తప్పుబడుతున్నారు. సీఎస్కే ఓటమిని రాయుడు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నాడని అంటున్నారు.