ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు నిరాశపరుస్తున్నాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్లో ముంబయి ఇండియన్స్కు చెందిన ఎంఐ ఎమిరేట్స్కు రాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం డిజర్ట్ వైపర్స్తో జరిగిన మ్యాచ్లో రాయుడు టెస్టు తరహా ఇన్నింగ్స్ ఆడి ముంబయి ఓటమికి ఓ కారణమయ్యాడు. మిడిలార్డర్లో ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడే రాయుడు వైపర్స్ మ్యాచ్లో బంతికో పరుగు చొప్పున కూడా రన్స్ సాధించలేకపోయాడు.
30 బంతులు ఎదుర్కొన్న అంబటి రాయుడు 23 పరుగులే సాధించాడు. 76 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన అతడు ఒక్క బౌండరీ బాదాడు. ముంబయి ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టులో స్లో ఇన్నింగ్స్ రాయుడు మాత్రమే ఆడటం గమనార్హం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 149 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (28; 14 బంతుల్లో) టాప్ స్కోరర్. వైపర్స్ టీమ్లో అమిర్ మూడు వికెట్లు, హసరంగ, పతిరనా చెరో రెండు వికెట్లు సాధించారు..

అయితే ఛేదనలో డిజర్ట్ వైపర్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వైపర్స్ 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కానీ హసరంగ (26; 22 బంతుల్లో), అజమ్ ఖాన్ (20; 12 బంతుల్లో) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎమిరేట్స్ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు సాధిస్తూ పైచేయి సాధించారు. దీంతో వైపర్స్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి వచ్చింది. షాహిన్ అఫ్రిది (17*; 12 బంతుల్లో), లుకే వుడ్ (6*; 6 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.
బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో తొలి అయిదు బంతుల్లో ఏడు పరుగులు సాధించారు. చివరి బంతికి మూడు పరుగులు అవసరమవ్వగా.. షాహిన్ అఫ్రిది షాట్కు యత్నించగా ఔట్సైడ్ ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. దాన్ని ఫీల్డర్ అందుకుని త్రో వేసేలోపు అఫ్రిది, వుడ్ చకచక పరుగులు తీసి జట్టుకు విజయాన్ని అందించారు.