తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు మరో విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం క్రికెట్కు వీడ్కోలు పలికిన రాయుడు.. ఈసారి తన నిర్ణయం వెనక్కు తీసుకోనంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అంతకుముందు అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. ఆ నిర్ణయం వెనక్కు తీసుకున్నాడు.
గతేడాది కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన అతను.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కల్పించుకోవడంతో ఈ నిర్ణయం వాపస్ తీసుకున్నాడు. ఇలాంటి క్రమంలో రాయుడు రిటైర్మెంట్ ప్రకటించినా మళ్లీ యూటర్న్ తీసుకుంటాడేమో? అని కొందరు అనుకున్నారు. అందుకే ఈసారి అలాంటిదేం ఉండదని రాయుడు తన రిటైర్మెంట్ ట్వీట్లో సరదాగా హామీ ఇచ్చాడు.

అయితే ఇప్పుడు మరో నిర్ణయంలో రాయుడు యూ-టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే అగ్రరాజ్యం అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) ప్రారంభం అవనున్న సంగతి తెలిసిందే. దీనిలో పాల్గొనేందుకు రాయుడు రెడీ అయినట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్.. ఎంఎల్సీలో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టులోనే రాయుడు ఆడాల్సింది.
అయితే క్రికెట్కు వీడ్కోలు పలికిన ప్లేయర్లు కనీసం ఏడాది పాటు వెయిట్ చేసిన తర్వాతనే విదేశాల్లోని టీ20 లీగుల్లో పాల్గొనాలంటూ బీసీసీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది. సెప్టెంబరులో జరిగే వార్షిక సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసి, నిబంధనల్లో చేర్చాలని బీసీసీఐ డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే ఎంఎల్సీ నుంచి రాయుడు తప్పుకున్నట్లు తెలుస్తోంది.
భారత జట్టులో చోటు దక్కని దేశవాళీ ప్లేయర్లు అందరూ ఒకేసారి కట్టకట్టుకొని రిటైర్మెంట్ తీసుకొని, విదేశీ లీగ్స్లో పాల్గొంటే? అనే ఆలోచనతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా వేరే చోట అవకాశాలు వెతుక్కోవడానికి రిటైర్మెంట్ తీసుకునే అవకాశం లేకుండా నిబంధనలు తీసుకొస్తాం అని అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించాడు. ఒక పాలసీ సిద్ధం చేసి దాన్ని అప్రూవల్ కోసం పంపుతామన్నాడు.