విధ్వంసానికి మారుపేరు.. దూకుడుకు పర్యాయ పదం సన్రైజర్స్ హైదారాబాద్. అలాంటిది.. ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయాలను అందుకోలేక సతమతమవుతోంది. పేలవ ప్రదర్శనతో చతికిలపడింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో వరుసగా ఓడింది. జట్టులోని విధ్వంసకర బ్యాటర్లంతా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్, హెన్రిచ్ క్లాసెన్ సహా ఇతర బ్యాటర్లంతా తక్కువ పరుగులకే వెనుదిరుగుతున్నారు. అయితే మాజీ ప్లేయర్ అంబటి రాయుడు మాత్రం సన్ రైజర్స్ ఓటమికి అసలు కారణం బ్యాటింగ్ వైఫల్యం కాదని అన్నాడు. మధ్య ఓవర్లలో బౌలింగ్ బలహీనతే SRH ఓటమికి కారణమని అభిప్రాయపడ్డాడు.
అలా కనిపించడం లేదు..
ఈ సీజన్లో వరుసగా నాలుగో మ్యాచులో హైదరాబాద్ జట్టు ఓడిపోవడం తర్వాత ఈ వ్యాఖ్యలు చేశాడు అంబటి రాయుడు. "మిడిల్ ఓవర్లలో అవసరమైన సమయంలో వికెట్లు తీసే బౌలర్లు SRHకు లేరు. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు సాయి కిషోర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.. ప్రత్యర్థి జట్టును ఎలా అయితే ఒత్తిడిలోకి నెడతారో అలాంటి బౌలర్లు సన్ రైజర్స్లో లేరు. సన్రైజర్స్లో వికెట్లు తీయాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించలేదు. వాళ్లు డిఫెన్సివ్ గా ఆడుతున్నారు. బ్యాటర్లు బౌండరీలు బాదకుండా ఉండేలా మాత్రమే బౌలింగ్ చేస్తున్నారు. ఇలాంటి మిడిల్ ఓవర్స్ బౌలింగ్ తో IPL గెలవడం కష్టం. మిడిల్ ఓవర్లలో గేమ్ మార్చే బౌలర్లు అవసరం." అని రాయుడు పేర్కొన్నాడు.
