
ఇకపై రంజీ ట్రోఫీతో సహా 4 రోజుల మ్యాచ్లకు:
హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతను ఇకపై రంజీ ట్రోఫీతో సహా నాలుగు రోజుల మ్యాచ్ల బరిలో దిగడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశవాళీ టోర్నీ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అతను కొనసాగనున్నాడు. ప్రస్తుతం టీమ్ఇండియా టెస్టు జట్టుకు ఎంపికయ్యే అవకాశం దాదాపు లేకపోవడం, పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్పైనే దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు.

వచ్చే ఫిబ్రవరి వరకు రంజీ సీజన్
వచ్చే ఫిబ్రవరి వరకు రంజీ సీజన్ జరుగుతుంది. ఇదే సమయంలో టీమిండియా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో వన్డే సిరీస్లు ఆడాల్సి ఉంది. కొన్ని మ్యాచ్లు మినహా రంజీ సీజన్కు దాదాపు అందుబాటులో ఉండని పరిస్థితి. మరోవైపు టీమిండియాలో నాలుగో స్థానంలో కుదురుకున్న అతడికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ కప్ జట్టులోనూ చోటు దక్కడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో అటు జాతీయ జట్టుకు, ఇటు రంజీల్లో ఆడుతూ ఫిట్నెస్ను నిలబెట్టుకోవడం కష్టమని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికై పరీక్షలో విఫలమై
గతంలో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనప్పటికీ యోయో పరీక్షలో విఫలం కావడంతో అతడు టీమ్ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో భారత జట్టు ఎనిమిది వన్డేలు ఆడనుంది. ఆ సిరీస్లకు ఫిట్గా ఉండాలన్న లక్ష్యంతో ఉన్నాడట రాయుడు. భారత పరిమిత ఓవర్ల జట్లలో కీలక ఆటగాడిగా ఉన్న 33 ఏళ్ల రాయుడు ఇప్పటివరకు ఒక్క టెస్టులో కూడా ఆడలేదు.

హైదరాబాద్ తరఫున ఆడుతూనే రిటైర్మెంట్
17 ఏళ్ల తన సుదీర్ఘ ఫస్ట్క్లాస్ క్రికెట్ కెరీర్లో 97 మ్యాచ్లాడిన రాయుడు 6151 పరుగులు చేశాడు. దాంట్లో 16 సెంచరీలతో పాటు 34 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 210. హైదరాబాద్ తరఫున 2002లో రంజీల్లోకి అరంగేట్రం చేసిన రాయుడు.. ఆ తర్వాత రెండు జట్లు మారి.. తాజాగా హైదరాబాద్ తరఫున ఆడుతూనే రిటైర్మెంట్ ప్రకటించేశాడు.


Click it and Unblock the Notifications












