చెన్నైలో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి త్వరలో దేవాలయాలు నిర్మిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. ధోనీ క్రేజ్ గురించి మాట్లాడుతూ రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ధోనీ చెన్నైకి దేవుడు అని, అక్కడ త్వరలో కచ్చితంగా ధోనీ పేరిట గుళ్లు ఏర్పడతాయని అన్నాడు. 42 ఏళ్ల ధోనీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు స్టేడియంలోనే ఉండాలని సీఎస్కే ఫ్రాంచైజీ కోరడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ధోనీ రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మ్యాచ్ ముగిశాక సహచర ఆటగాళ్లతో కలిసి ధోని మైదానంలో తిరుగుతూ స్టాండ్స్లోని అభిమానులకు అభివాదం చేశాడు.

''ధోనీ గాడ్ ఆఫ్ ది చెన్నై. మరి కొన్నేళ్లలో చెన్నైలో ధోనీ దేవాలయాలు కచ్చితంగా నిర్మిస్తారని భావిస్తున్నా. రెండు వరల్డ్ కప్లు సాధించి భారత్కు ఆనందాన్ని అందించిన వ్యక్తి ధోనీ. అంతేకాదు, ఐపీఎల్ ట్రోఫీలు, ఛాంపియన్ లీగ్ టైటిళ్లు సాధించి చెన్నైకి సంతోషాన్ని అందించాడు. తన ఆటగాళ్లపై ఎంతో నమ్మకం ఉంచే సారథి అతడు. ఎల్లప్పుడూ దేశం, జట్టు, సీఎస్కే కోసం ఆడతాడు'' అని రాయుడు పేర్కొన్నాడు.
ఐపీఎల్లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్తో పాటు రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ తరఫున కూడా ప్రాతినిథ్యం వహించాడు. లీగ్లో 263 మ్యాచ్లు ఆడిన ధోనీ 5218 పరుగులు చేశాడు. 24 అర్ధశతకాలు సాధించాడు. 14 సీజన్లలో సీఎస్కే జట్టును నడిపించిన ధోనీ అయిదు సార్లు జట్టును విజేతగా నిలిపాడు. కాగా, ధోనీ ఈ సీజన్లో వికెట్ కీపర్గానే బరిలోకి దిగాడు. ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టు బాధ్యతలు అందుకున్నాడు.

ఇక సీఎస్కే విషయానికొస్తే.. రాజస్థాన్ రాయల్స్పై నెగ్గి ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకుంది. మే 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్లో విజయం సాధించి లక్నో కంటే మెరుగైన నెట్ రన్ రేటు సాధిస్తే టాప్-4లో నిలుస్తుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన చెన్నై 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.