హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరో విడుత హరితహారం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఆయా జిల్లాల్లో మొక్కలు నాటారు. తాజాగా ఆరో విడత హరితహారంలో భారత వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు కూడా పాల్గొన్నాడు. గురువారం యాచారం మండల కేంద్రంలో ఆయన మొక్కలు నాటాడు.
ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ... 'తెలంగాణ ప్రభుత్వం ఏటా హరితహారం నిర్వహిస్తుండటం అభినందనీయం. హరిత తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా అందరూ ప్రతి యేటా ఐదు మొక్కలు నాటండి. మొక్కలు నాటి సంరక్షణ చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టి విరివిగా మొక్కలు నాటి రేపటి తరానికి స్వచ్ఛమైన గాలిని అందించాలి' అని పిలుపునిచ్చాడు.
2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన అంబటి రాయుడు.. గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రాయుడు నిర్ణయంపై చాలామంది మాజీలు పెదవివిరిచారు. అనంతరం ఆ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ తరఫున దేశవాళీ క్రికెట్లో ఆడిన రాయుడు.. ఐపీఎల్ 2020 సీజన్లో రాణించి మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆశించాడు. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అసలు ఈ ఏడాది లీగ్ జరుగుతుందో లేదో కూడా అనుమానంగానే ఉంది.
2013లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన అంబటి రాయుడు ఇప్పటి వరకు 55 వన్డేలు, 6 టీ20 మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 1694 పరుగులు.. టీ20ల్లో 42 రన్స్ చేశాడు. మూడు సెంచరీలు బాదాడు. అయితే 147 ఐపీఎల్ మ్యాచ్లలో 3300 పరుగులు చేశాడు. పొట్టి .ఫార్మాట్లో కూడా ఓ సెంచరీ బాదాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. నిలకడలేమి కారణంగా 2018 వరకూ రాయుడికి రెగ్యులర్గా అవకాశాలు దక్కలేదు. అయితే 2018 ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారించిన రాయుడు.. భారత్ జట్టులో వరుసగా అవకాశాల్ని దక్కించుకున్నాడు. నెం.4 స్థానానికి పరిష్కారం దొరికిందనుకున్న సమయంలో ఫామ్ కోల్పోయి మళ్లీ జట్టుకు దూరమయ్యాడు.
ఆర్చర్కి రెండోసారి కరోనా నెగటివ్.. విండీస్ సిరీస్కి లైన్ క్లియర్!!